ఎస్పీ బాలు కోసం దీపం వెలిగించిన ఇళయరాజా: తిరువన్నమలై ఆలయంలో నివాళి
ప్రాణస్నేహితుడు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం మరణ వార్త విని తల్లడిల్లిపోయిన మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ఎస్పీ బాలు కోసం కన్నీటి పర్యంతం అవుతున్న విషయం తెలిసిందే . నిన్న ఆయన మరణానంతరం ఎక్కడికి వెళ్లావు ? ఎందుకు వెళ్లావు ? మిత్రమా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పాను. త్వరగా తిరిగి రమ్మని చెప్పాను.. కానీ నా మాట వినకుండా నువ్వు వెళ్ళిపోయావు అంటూ భావోద్వేగానికి లోనైన విషయం తెలిసిందే .ఎస్పీ బాలు మృతితో ఆయన గుండె పగిలిపోగా ఆయన ఎస్పీబాలు అంత్య క్రియలకు వెళ్లలేకపోయారు.

ఎస్పీ బాలు కోసం ఆలయంలో దీపం వెలిగించిన ఇళయరాజా
నిన్న తామరైపాక్కంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం వ్యవసాయ క్షేత్రంలో జరిగిన అంత్యక్రియలకు హాజరు కాలేకపోయిన ఇళయరాజా తన ఆప్త మిత్రుడు, ప్రాణ స్నేహితుడి కోసం ఒక దీపం వెలిగించి నివాళులర్పించారు. బాలు లేని లోటు వల్ల కలిగిన దుఃఖాన్ని భరించడం సాధ్యం కావడం లేదంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. గంధర్వుల కోసం పాట పాడడానికి వెళ్ళావా అంటూ అత్యంత హృదయవిదారకంగా బాలు కోసం ఆవేదన చెందిన ఇళయరాజా సెప్టెంబర్ 26వ తేదీన తిరువన్నమలై ఆలయంలో ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం దీపాన్ని వెలిగించారు.

తిరువన్నమలై ఆలయంలో ఎస్పీ బాలుకు ఇళయరాజా నివాళి
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించడానికి ఆలయానికి వెళ్ళిన ఇళయరాజా అక్కడ బాలు కోసం దీపాన్ని వెలిగించి భగవంతుడిని ప్రార్ధించారు.ఇక ఇదే విషయాన్ని ఇళయరాజా బృందం ఆయన ఫేస్ బుక్ పేజీలో షేర్ చేశారు. తిరువన్నమలై ఆలయంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి మాస్ట్రో ఇళయరాజా నివాళులర్పించారు అంటూ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లో తన ఆప్త మిత్రుడు లేడని తెలిసి ఇళయరాజా బాగా కుంగిపోయారు అని, వారు సినిమాల్లోకి రాక ముందు నుండే మంచి స్నేహితులని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు.

సినిమాల్లోకి రాక ముందు నుండే ఇళయరాజా , బాలు స్నేహితులు
ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఇళయరాజా గంగై అమరన్, మరియు అనిరుట్టలతో కలిసి సంగీత బృందాన్ని నిర్వహించారని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. ఆయన మరణానంతరం ఊహించనివిధంగా ఇళయరాజా తీవ్ర వేదనకు లోనయ్యారని తాజాగా ఆయన విడుదల చేసిన వీడియోని బట్టి అర్థమౌతుంది. బాలు లేని దుఃఖాన్ని భరించడం సాధ్యం కాదని చెప్పిన ఆయన, బాలు అంత్యక్రియలకు వెళ్లలేకపోయిన నేపథ్యంలో బాలు ఆత్మకు శాంతి చేకూరాలని దీపాన్ని వెలిగించి అంజలి ఘటించారు.
Recommended Video

బాలు గానం సంగీతం ఉన్నంతకాలం శాశ్వతం
ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా కారణంగా ఆగస్టు 5 వ తేదీన ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుండి నలభై రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన బాలు సెప్టెంబర్ 25న తుది శ్వాస విడిచారు. నిన్న సెప్టెంబర్ 26వ తేదీన తామరైపాక్కం లోని బాలసుబ్రమణ్యం వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు. బాలసుబ్రహ్మణ్యం అభిమానులు, సినీ తారలు, సినీ ప్రముఖులు, కళాకారులు బాలసుబ్రమణ్యం కోసం కన్నీటిపర్యంతమయ్యారు.దివికేగిన గాంధర్వ గాయకుడిని మర్చిపోలేమని , ఆయన గానం సంగీతం ఉన్నంత కాలం శాశ్వతంగా నిలిచి ఉంటుందని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications