ఆధిక్యతలో తండ్రీ కొడుకులు: సిల్వర్ స్క్రీన్పై..ఇక పాలిటిక్స్లో ఆ హీరో గ్రాండ్ ఎంట్రీ
చెన్నై: తమిళనాడులో అధికార మార్పిడి ఖాయమైంది. పదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన ఏఐఎడీఎంకే.. ఇక ప్రతిపక్ష పాత్రకే పరిమితం కానుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న అన్నాడీఎంకేను తమిళ ఓటర్లు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ప్రతిపక్షంలో ఉన్న డీఎంకేకు అధికారాన్ని అప్పగించారు. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న కొద్దీ- డీఎంకే ఆధిక్యత పెరుగుతోందే తప్ప.. ఎక్కడా తగ్గట్లేదు.
తాజాగా అందిన సమాచారం ప్రకారం.. డీఎంకే 111 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతోంది. ఆ పార్టీ మిత్రపక్ష పార్టీలు 32 చోట్ల లీడ్లో ఉన్నారు. మొత్తం కలిపి 143 చోట్ల లీడ్లో ఉన్నారు. ఏఐఏడీఎంకే-బీజేపీ మిత్రపక్షాల పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంటోంది. ఇప్పటిదాకా అన్నా డీఎంకే, ఆ పార్టీ మిత్రపక్షాలు 89 స్థానాలేక పరిమితం అయ్యాయి. ఈ పరిణామాలు డీఎంకే క్యాడర్ను ఆనందంలో ముంచెత్తుతోంది. ఎన్నికల కమిషన్ ఆదేశాలను కూడా కాదని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకొంటున్నారు.
ఇదిలావుండగా.. డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంకే స్టాలిన్, ఆయన కుమారుడు, నటుడు, పార్టీ యువజన విభాగం నాయకుడు ఉదయనిధి స్టాలిన్.. ఇద్దరూ భారీ లీడింగ్లో కొనసాగుతున్నారు. స్టాలిన్.. కొళత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. తన సమీప ప్రత్యర్థి, ఏఐఎడీఎంకే అభ్యర్థిపై భారీ ఆధిక్యతను కనపరుస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్.. చెపాక్-తిరువెళ్లికేణి నియోజకవర్గం నుంచి లీడ్లో ఉన్నారు. వారిద్దరి గెలుపు దాదాపు ఖాయమైంది.
థౌజండ్ లైట్స్ నుంచి పోటీ చేసిన మరో తమిళనటి ఖుష్బూ సుందర్కు పరాజయం తప్పేలా లేదు. ఇదివరకు కాంగ్రెస్లో కొనసాగిన ఆమె.. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు బీజేపీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా థౌజండ్ లైట్స్ నుంచి బరిలో దిగారు. ఆమె వెనుకంజలో ఉన్నారు. డీఎంకే అభ్యర్థి ఆమెపై భారీ ఆధిక్యతను సాధించారు. మొత్తం మీద బీజేపీకి ఈ సారి కూడా నిరాశే ఎదురైంది. తమిళనాడులో ఎంట్రీ ఇవ్వడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.