నిన్న ఖుష్బూ..నేడు తమిళ నటుడు విజయ్ తండ్రి: బీజేపీలో ఎంట్రీ: నిజమేనా? క్లారిటీ ఏంటీ?
చెన్నై: తమిళనాడులో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. తమిళనాడు రాజకీయాలు ఎన్నికల సంవత్సరంలోకి అడుగు పెట్టాయి. తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహించడానికి దాదాపు ఏడెనిమిది నెలల సమయం మాత్రమే ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల్లో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పూర్తి కావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇటీవలే తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించింది అధికార అన్నా డీఎంకే. ప్రస్తుత ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి సారథ్యంలోనే తాము అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని, తదుపరి ముఖ్యమంత్రి పీఠాన్ని ఆయనే అధిరోహిస్తారనీ వెల్లడించింది.

ఖుష్బూ చేరికతో.. ఊహాగానాలు చక్కర్లు..
తమిళనాడు క్రమంగా అసెంబ్లీ ఎన్నికల వాతావరణంలోకి జారుకుంటోన్న సమయంలోనే.. ప్రముఖ నటి ఖుష్బూ భారతీయ జనతా పార్టీలో చేరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇన్ని రోజుల పాటు కాంగ్రెస్లో కొనసాగిన ఆమె ఉన్నట్టుండి బీజేపీలో చేరారు. దేశ రాజధానిలోని బీజేపీ జాతీయ కార్యాలయానికి వెళ్లి మరీ కాషాయ కండువాను కొప్పుకొన్నారు. ప్రస్తుతం తమిళనాడులో ఉన్న అన్నా డీఎంకేతో బీజేపీ సీట్ల సర్దుబాటు చేసుకుంటుందని, ఈ రెండు పార్టీలు ఉమ్మడిగా అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటాయని చెబుతున్నారు. గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల సందర్భంగా అన్నా డీఎంకే-బీజేపీ మధ్య పొత్తు కుదరిన విషయం తెలిసిందే.

తటస్థులపై బీజేపీ కన్నేసిందా?
ఈ పరిస్థితుల్లో తమిళనాడుకు చెందిన పలువురు తటస్థులపై బీజేపీ కన్నేసిందని అంటున్నారు. తటస్థులను తమ పార్టీలో తీసుకోవడం ద్వారా ఓటుబ్యాంకును గణనీయంగా పెంచుకోవచ్చనే దిశగా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని, ఇందులో భాగంగానే ఖుష్బూను తమ పార్టీలోకి చేర్చుకుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అదే సమయంలో- తమిళనాడు మాస్ హీరో విజయ్ తండ్రి, దర్శకుడు ఎస్ ఏ చంద్రశేఖర్ కూడా కమలనాథులతో చేతులు కలుపుతారనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఖుష్బూ తరహాలోనే ఆయన కూడా బీజేపీలో చేరుతారనే వార్తలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి.

విజయ్ తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్ కూడా..
దీనిపై ఎస్ ఏ చంద్రశేఖర్ నోరు విప్పారు. తాను బీజేపీలోకి చేరబోతున్నానంటూ వస్తోన్న వార్తలపై ఆయన తొలిసారిగా స్పందించారు. తాను బీజేపీలో చేరబోయే ప్రసక్తే లేదని తేల్చి పారేశారు. తనపై దుష్ప్రచారానికి తెర తీసినట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. తాను బీజేపీలో చేరబోవట్లేదంటూ క్లారిటీ ఇచ్చారు. తాను బీజేపీలో చేరబోతున్నానంటూ వార్తలు వస్తోన్న విషయం తన దృష్టికి వచ్చిందని, అవన్నీ నిరాధారమైనవేనని తేల్చి చెప్పారు. బీజేపీలోకి చేరాలనే ఆలోచన తనకు ఏ మాత్రం లేదని స్పష్టం చేశారు. ఈ వార్తలను విశ్వసించవద్దని ఆయన అభిమానులకు విజ్ఙప్తి చేశారు.

సొంత పార్టీని ఏర్పాటు చేస్తారా?
నిజానికి- విజయ్.. సొంతంగా రాజకీయ పార్టీ పెడతారనే ప్రచారం తమిళనాడులో సాగుతోంది. ఈ వార్తలను విజయ్ తోసిపుచ్చిన సందర్భాలు కూడా లేవు. ఆయన ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారనేది తెలియ రాలేదు. సొంతంగా రాజకీయ పార్టీని స్థాపిస్తారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ సోషల్ మీడియా వేదికగా పలుమార్లు ఈ విషయం చర్చల్లోకి ఎక్కింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరహాలోనే విజయ్ కూడా డైనమిక్గా పరిపాలిస్తారంటూ తమిళనాడులో బ్యానర్లు వెలిశాయి. వైఎస్ జగన్, విజయ్ ఫొటోలతో బ్యానర్లు, వాల్ పోస్టర్లు వెలిసిన సందర్భాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications