ఎమ్మెల్యే రోజాపై దాడి.. మంత్రి పెద్దిరెడ్డి వర్గం పనేనా? సీఎం జగన్ ఆగ్రహం..
సొంత నియోజకవర్గం నగరిలో.. సొంత పార్టీ కార్యకర్తలే తనపై దాడికి యత్నించడాన్ని వైసీపీ ఎమ్మెల్యే రోజా సీరియస్ గా తీసుకున్నారు. అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన టైమ్ లో తననపై కొందరు దాడికి యత్నించారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పుత్తూరు పోలీసులు.. మొత్తం ఏడుగురిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రోజాపై దాడి కేసు నిందితుల్లో సరళ అనే మహిళ కూడా ఉన్నారు. కాగా, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గమే ఇదంతా చేయించి ఉంటుందని ఎమ్మెల్యే అనుమానిస్తున్నారని, ఈ మేరకు మంత్రిపై సీఎం జగన్ కు ఫిర్యాదుకూడా చేయబోతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

సీఎం ఆగ్రహం..
ఆదివారం నగరిలో గ్రామసచివాలయం బిల్డింగ్ ప్రారంభోత్సవానికి వెళ్లిన రోజాపై వైసీపీ కార్యర్తలే దాడికి యత్నించిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జనగ్ ఆగ్రహించినట్లు తెలిసింది అసలు నగరిలో ఏం జరిగిందో వివరాలు తెల్సుకున్న జగన్.. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలని సూచించారు. నగరి నియోజకవర్గంలో చాలా కాలంగా తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నవాళ్లే ఆదివారంనాటి దాడిలో పాలుపంచుకున్నారని ఎమ్మెల్యే రోజా చెబుతున్నారు. దాడి ఘటనతో మంత్రి పెద్దిరెడ్డి వర్గీయులకు ఎలాంటి సంబంధాలున్నాయనే ఆధారాలతోసహా రోజా.. ఒకటిరెండు రోజుల్లోనే సీఎంను కలవనున్నట్లు సమాచారం. నేరుగా మంత్రిపైనా ఆమె ఫిర్యాదు చేసే అవకాశముంది.

ఎన్నికల్లో ఓడించడానికీ ప్రయత్నించారు..
చిత్తూరు జిల్లా వైసీపీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గంతో రోజా వర్గానికి చాలా కాలంగా వైరం కొనసాగుతున్నది. మొన్నటి ఎన్నికల్లో నగరి నియోజకవర్గంలో రోజా కేవలం 2వేల పైచిలుకు మెజార్టీతో బయటపడగలిగారు. తనను ఓడించడానికి పెద్దిరెడ్డి వర్గం తీవ్రంగా ప్రయత్నించిందని అప్పట్లో రోజా తన సన్నిహితుల వద్ద బాధపడినట్లు వార్తలొచ్చాయి. మంత్రి పదవుల విషయంలోనూ పెద్దిరెడ్డి వర్గం వల్లే తనకు అవకాశం చేజారిందని ఆమె భావిస్తున్నారట.

మంత్రి పదవి రోజాకే?
సీఎం జగన్ మాటిచ్చినట్లు.. రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్ రీషఫుల్ జరిగితే.. చిత్తూరు కోటా నుంచి తాను మంత్రి కావడం ఖాయమని రోజా ఆశలు పెట్టుకున్నారు. ఆలోపే వీలైనన్ని మార్గాల్లో తమ నేతలను ఇబ్బంది పెట్టాలని పెద్దిరెడ్డి వర్గం భావిస్తోందని, అందులో భాగంగానే దాడి ఘటన జరిగిందని రోజా వర్గీయులు వాదిస్తున్నారు. సీఎం జగన్ ను కలిసి నగరి ఘటనతోపాటు జిల్లా వ్యవహారాలనూ ఎమ్మెల్యే రోజా వివరిస్తారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications