కుప్పంలో కలకలం - హౌరా ఎక్స్ప్రెస్ బోగీలో మంటలు..!!
చిత్తూరు: బెంగళూరు-హౌరా దురంతో ఎక్స్ప్రెస్లో బోగీలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పింది. ప్రయాణికులెవరూ గాయపడలేదు. అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే ప్రయాణికులు అప్రమత్తం అయ్యారు. రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే భద్రత సిబ్బంది, స్థానిక పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక కార్యక్రమాలను చేపట్టారు. చిత్తూరు జిల్లా కుప్పంలో రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
బెంగళూరులోని సర్ ఎం విశ్వేశ్వరాయ టెర్మినల్ నుంచి ఈ ఉదయం హౌరాకు బయలుదేరింది నంబర్ 12246 నంబర్ దురంతో ఎక్స్ప్రెస్. మాలూరు, కుప్పం, జోలార్పేట్టై, కాట్పాడి జంక్షన్, తిరుత్తణి జంక్షన్, నగరి, రేణిగుంట, విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్ మీదుగా హౌరాకు వెళ్లాల్సి ఉంది. మార్గమధ్యలో మధ్యాహ్నం 12:50 నిమిషాలకు కుప్పం రైల్వే స్టేషన్కు చేరుకుంది. ఆ వెంటనే ఎక్స్ప్రెస్ ఎస్9 బోగీ కింది భాగం నుంచి పొగ బయటికి వచ్చింది. పెద్ద శబ్దం చేస్తూ రైలు ఆగిపోయింది.
దీన్ని గమనించిన వెంటనే ప్రయాణికులు అప్రమత్తం అయ్యారు. తమ లగేజీలతో కిందికి దిగారు. పరుగులు పెడుతూ పట్టాలు దాటుకుని స్టేషన్ ప్లాట్ఫామ్పైకి చేరుకున్నారు. దీనితో రైల్వే స్టేషన్లో కొంతసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ట్రైన్ మేనేజర్ (గార్డ్) కుప్పం స్టేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
This is not a fire accident, but a case of brake binding. The on board staff attended it immediately and train was started at 13.36 hrs. pic.twitter.com/MQleNMr7Bw
— South Western Railway (@SWRRLY) November 27, 2022
ఈ ఘటనపై నైరుతి రైల్వే అధికారులు వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. బెంగళూరు-హౌరా దురంతో ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం- తనిఖీ కోసం ఎక్స్ప్రెస్ను కుప్పం స్టేషన్లో నిలిపివేయాల్సి వచ్చిందని, ఆ సమయంలో బ్రేక్ బైండింగ్ అయినట్లు సిబ్బంది గుర్తించారని చెప్పారు.
బ్రేక్ బ్లాక్ కావడం వల్ల పొగ వెలువడిందని వివరించారు. వెంటనే సిబ్బంది బ్రేక్ బైండింగ్ను సరిచేశారని, బ్రేక్ బ్లాక్ను తొలగించారని నైరుతి రైల్వే అధికారులు ఈ ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం 1:33 నిమిషాలకు దురంతో ఎక్స్ప్రెస్.. కుప్పం రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి వెళ్లినట్లు చెప్పారు. ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ గాయాలు కావడం గానీ.. ప్రాణాపాయం సంభవించడం గానీ జరగలేదని స్పష్టం చేశారు.