నేను మూడో కన్ను తెరిస్తే భస్మమే.. వైద్యులను బెదిరించిన పద్మజ.. ఆ విపరీతత్వంతోనే అదో లోకానికి...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులు పద్మజ-పురుషోత్తం నాయుడులకు శుక్రవారం(జనవరి 29) తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు,కౌన్సెలింగ్ నిర్వహించారు. రుయా సూపరింటెండెంట్ డాక్టర్ భారతి అనుమతితో సైకియాట్రీ విభాగ వైద్యాధికారి ప్రొఫెసర్ నాగేశ్వరరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వంశీకృష్ణ పద్మజ, పురుషోత్తమ నాయుడు దంపతులను పరీక్షించారు. ఈ ఇద్దరూ స్కిజోఫ్రేనియా, మేనియా తదితర మానసిక సమస్యల లక్షణాలతో బాధపడుతున్నారని... వీరికి మరింత కౌన్సెలింగ్,అధునాతన పరీక్షలు అవసరమని నిర్దారించారు. ఇందుకోసం విశాఖ మెంటల్ ఆస్పత్రికి రిఫర్ చేశారు.
కుటుంబమంతా నగ్నంగా పూజలు.. మృతదేహంపై ముగ్గు వేసి... మదనపల్లె కేసులో భయంకర నిజాలు
రుయా సూపరింటెండెంట్ ఏమన్నారు...
రుయా సూపరింటెండెంట్ డాక్టర్ భారతి మాట్లాడుతూ... ప్రత్యేక వైద్య బృందంతో నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. సుమారు ఐదు గంటల పాటు ఇద్దరికీ విడివిడిగా కౌన్సెలింగ్ నిర్వహించి వారి మానసిక స్థితిని అంచనా వేశామన్నారు. ఇద్దరూ పలు రకాల మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించామని... వీరికి మరిన్ని వైద్యపరీక్షలు అవసరం ఉన్నందునా విశాఖ మెంటల్ ఆస్పత్రికి రిఫర్ చేశామని తెలిపారు.
కౌన్సెలింగ్ ఇచ్చిన డాక్టర్లు ఏమంటున్నారు...
పద్మజ-పురుషోత్తం దంపతులకు కౌన్సెలింగ్ నిర్వహించిన డా.నాగేశ్వరరావు మాట్లాడుతూ... కౌన్సిలింగ్ సమయంలో పద్మజ కాస్త భావోద్రేకంగా కనిపించగా.. పురుషోత్తం నాయుడు మాత్రం సాధారణంగా కనిపించినట్లు తెలిపారు. రుయాలో కస్టడీ కేర్ లేకపోవడం, 24గంటలు ప్రొటెక్షన్ కల్పించే వాతావరణం,అందుకు తగిన అనుభవం ఉన్న సిబ్బంది లేకపోవడంతో విశాఖ మెంటల్ ఆస్పత్రికి రిఫర్ చేసినట్లు చెప్పారు. విశాఖ ఆస్పత్రిలో క్లోజ్డ్ వార్డు ఉండడంతోనే అక్కడికి సిఫార్సు చేసినట్లు చెప్పారు.
మూడో కన్ను తెరిస్తే భస్మమే.. : పద్మజ
నిందితురాలు పద్మజ ఇప్పటికీ ఏదో ధ్యాసలో ఉంటూ పిచ్చి ప్రేలాపనలు చేస్తోంది. రుయా ఆస్పత్రిలో వైద్యుల కౌన్సెలింగ్ సందర్భంగా కూడా ఆమె తన ప్రేలాపనలతో వైద్యులను హడలెత్తించే ప్రయత్నం చేసింది. తాను మూడో కన్ను తెరిస్తే మీరంతా భస్మమవుతారని వైద్యులను బెదిరించింది. అయినప్పటికీ వైద్యులు సంయమనంతో,ఓపికతో ఆమెకు కౌన్సెలింగ్ నిర్వహించారు. రుయాలో వైద్య పరీక్షలు,కౌన్సెలింగ్ అనంతరం తిరిగి వారిని మదనపల్లె సబ్జైలుకు తరలించారు. అక్కడ నుంచి అనుమతులు పొందిన తర్వాత విశాఖ మెంటల్ ఆస్పత్రికి తరలించనున్నారు.
సోదరుడు ఏమంటున్నారు...
పురుషోత్తం నాయుడు సోదరుడు దిలీప్ కూడా ఈ ఘటనపై స్పందించారు. చిత్తూరు జిల్లా అరగొండ సమీపంలోని ఓ గ్రామంలో తాము నివసించేవారమని చెప్పారు. తాము ముగ్గురం అన్నదమ్ములం అని... పురుషోత్తమ నాయుడు తనకు స్వయాన అన్న అని తెలిపారు. వదిన పద్మజకు దైవ భక్తి ఎక్కువ అని... పెద్దమ్మాయి అలేఖ్య కూడా విపరీతమైన పూజలు చేసేదని చెప్పారు. వదిన,అలేఖ్య ఇద్దరూ విపరీత ఆధ్యాత్మిక భావనతో అదో లోకానికి వెళ్లిపోయారని పేర్కొన్నారు.అటు వైద్యులు కూడా వీరు విపరీతమైన దైవ చింతనతో మానసిక సమస్యలు కొని తెచ్చుకున్నారని చెబుతున్నారు.