ఎవరడ్డొస్తారో నేనూ చూస్తా: జగన్ పార్టీకి పవన్ కళ్యాణ్ హెచ్చరిక
తిరుపతి: కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పనిచేయడానికే జనసేన పార్టీ స్థాపించానని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. భావితరాలకు బంగారు భవిష్యత్తు ఇవ్వడమే లక్ష్యమన్నారు. రాయలసీమ యాత్రలో భాగంగా పీలేరులో భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాయలసీమలో ఇంత అపూర్వస్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీరు చూపించిన ప్రేమ మరిచిపోలేనిదన్నారు.

పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం
అంతకుముందు వందలాది బైక్ లు, పదుల సంఖ్యలో కార్లు అనుసరించగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో తిరుపతి నుంచి మదనపల్లికి బయల్దేరారు. దారి పొడవునా జనసేన శ్రేణులు పవన్ కళ్యాణ్పై పూలవర్షం కురిపించాయి. ప్రతి గ్రామ కూడలి వద్ద జనసైనికులు, మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపైకి తరలివచ్చి పవన్ కళ్యాణ్ గారికి హారతులిచ్చి స్వాగతం పలికారు. శ్రీనివాసమంగాపురం, చంద్రగిరి, చిన్నగొట్టిగల్లు, భాకరాపేటలో జనసైనికులు బాణాసంచా పేల్చి, మేళతాళాలతో ఆహ్వానం పలికారు. అభిమానులు జనసేన అధినేతకు గజమాలతో సత్కరించారు. రొంపిచర్ల క్రాస్ వద్ద స్కూల్ విద్యార్ధులు రోడ్ల పై నిలబడటం చూసిన పవన్ కళ్యాణ్ కాన్వాయ్ నిలిపివేసి వారిని ప్రేమగా పలకరించారు. పీలేరు, కలికిరి, వాయల్పాడులో జనసేనుడిని చూసేందుకు రోడ్లు కూడళ్లు జనసంద్రంగా మారాయి. రైతు సమస్యలు తెలుసుకోవడానికి రాయలసీమ పర్యటన చేస్తుంటే.. రైతు ప్రభుత్వం, పారదర్శక పాలన అని గొప్పలు చెప్పుకొంటున్న వైసీపీ ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తోందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు.

పవన్ కళ్యాణ్ హెచ్చరిక
మదనపల్లి మార్కెట్ యార్డులో టమాటా రైతులతో సమావేశానికి అనుమతులు ఇవ్వకపోతే రోడ్డుపైనే కూర్చుంటానని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. రేపు మార్కెట్ యార్డులో కచ్చితంగా రైతులతో సమావేశం జరిగి తీరుతుంది.. ఎవరు అడ్డుకుంటారో నేను చూస్తానని అన్నారు. మదనపల్లి నియోజకవర్గంలోని కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. "రాయలసీమ రతనాల సీమ. రాయలవారు ఏలిన నేల. ప్రపంచానికి తత్వాన్ని నేర్పిన జిడ్డు కృష్ణమూర్తి పుట్టిన నేల. రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతాన్ని రచించిన నేల. అంత గొప్ప చరిత్ర కలిగిన ఈ నేల కొంతమంది నాయకుల గుప్పెట్లో నలిగిపోతోంది. రాయలసీమ వెనకబాటు పారద్రోలే వరకు.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిగే వరకు.. కొన్ని కుటుంబాల కబంధ హస్తాల నుంచి రాయలసీమ ప్రజల చేతుల్లోకి వచ్చే వరకు సీమలో పర్యటన చేస్తూ ఉంటాను. ఎవరు అడ్డొస్తారో నేను చూస్తాను'

అప్పుడే జగన్ రెడ్డిని గౌరవిస్తా..
‘ఏ ప్రభుత్వం అయినా శంకుస్థాపనలతో పాలనను ప్రారంభిస్తుంది...కానీ వైసీపీ కూల్చివేతలతో పాలన ప్రారంభించింది. కూల్చివేతలతో మొదలైన పాలన అంతే వేగంగా కూలిపోతుంది. ప్రజలు వైసీపీ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించారు. ప్రజా తీర్పును గౌరవించి సంవత్సరంపాటు ఏం మాట్లాడకూడదని అనుకున్నాను. కానీ రెండు నెలలకే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. జగన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గుర్తించరా..? అని వైసీపీ నాయకులు బాధపడుతున్నారు. కూల్చివేతలతో కాకుండా శంకుస్థాపనలతో, పరిశ్రమలు వచ్చే వాతావరణం కల్పించి యువత ఉపాధి అవకాశాలు మెరుగుపడితే అప్పుడు గౌరవిస్తాను' పవన్ కళ్యాణ్ అన్నారు.

బిడ్డల బతుకులు బట్లర్ ఇంగ్లీష్ అయిపోతుంది
‘తెలుగు మాధ్యమం గురించి మాట్లాడితే .. జనసేన పార్టీ ఇంగ్లీషు మీడియంకు వ్యతిరేకం అని ప్రచారం చేశారు. మన బిడ్డలకు ఇంగ్లీష్ రావాలి.. కానీ అంతకంటే ముందు తెలుగు కూడా చాలా బాగా రావాలి. మాతృభాష మూలాలు బాగా తెలిస్తేనే ఇంగ్లీషు భాషను బాగా మాట్లాడగలం. లేదంటే బిడ్డల బతుకులు బట్లర్ ఇంగ్లీష్ అయిపోతుంది. అటు ఇంగ్లీషు రాక, ఇటు తెలుగు రాక రెండింటికి చెడ్డ రేవడి అయిపోతారు. తెలుగు భాషన్నా, సంస్కృతి అన్నా చాలా గౌవరం. దానిని నిలబెట్టుకోవాలి' అని వ్యాఖ్యానించారు.

ఎవరడ్డొస్తారో నేను చూస్తాను
‘వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా రౌడీయిజం పెరిగిపోయింది. కడపలో జన సైనికులపై కేసులు పెడుతున్నారు. యాక్సిడెంట్ చేసి చంపేస్తున్నారు. అన్నింటికి తెగించి రాజకీయాల్లోకి వచ్చాను. జన సైనికులను ఇబ్బందులకు గురి చేస్తే రాయలసీమలో గ్రామ గ్రామం తిరుగుతాను. ఎవరు బాంబులతో దాడులు చేస్తారో, ఎవరు వేట కొడవళ్లతో బెదిరిస్తారో నేను చూస్తాను. వైసీపీ నాయకుల మాదిరి ప్రాణం మీద తీపి లేదు. సమాజంలో ధైర్యం నింపే నాయకత్వం తీసుకొచ్చే వరకు పోరాటం చేస్తాను. వైసీపీ నాయకులు నన్ను ఎన్ని తిట్టినా... ఏకవచనంతో మాట్లాడినా భరిస్తాం. సహిస్తాం. పరిస్థితులు చేయిదాటితో ఏం చేయాలో చేస్తాం' అని పవన్ కళ్యాణ్ అన్నారు.

151 మంది ఎమ్మెల్యేలు ఎంత..?
రాయలసీమ ప్రాంతానికి పెట్టుబడులు రావు. ఎందుకు అంటే పెట్టుబడుదారులను స్థానిక నాయకులు బెదిరించి కమిషన్లు అడుగుతారు కనుక. బెదిరించే నాయకులను ఎదురొడ్డి నిలబడి పోరాటం చేయాలంటే గుండె ధైర్యం కావాలి. అలాంటి గుండె ధైర్యం కావాలంటే అంబేద్కర్, సుభాష్ చంద్రబో స్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి గొప్ప నాయకుల చరిత్రలు తెలుసుకోండి. వారి భావజాలం చదవండి. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. మన కన్న ఎక్కవ కష్టాలు పడ్డారు. బ్రిటిష్ సామ్రాజ్యంతో పోల్చుకుంటే 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఎంత..?. ప్రపంచం మారాలంటే మనం ముందు మారాలి. వలసలు వెళ్లిపోతున్న యువత కోసం పోరాటం నేను చేస్తాను. మీ మీద దెబ్బవేయాలంటే పవన్ కళ్యాణ్ గుర్తుకు వచ్చేలా పోరాటం చేస్తానని మాట ఇచ్చారు. త్వరలోనే కుప్పం, పులివెందుల, తంబళ్ళపల్లిలో పర్యటిస్తాను. మీరు పడుతున్న బాధలను స్వయంగా తెలుసుకుంటాన"ని జనసైనికులకు హామీ ఇచ్చారు.

పొరపాటు అయిందని బాధపడుతున్నారు: నాదెండ్ల మనోహర్
పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ.. "కనీవినీ ఎరుగని రీతిలో ఘన స్వాగతం పలికిన ప్రతి ఒక్క జన సైనికుడికి ధన్యవాదాలు. పార్టీ బలోపేతంలో భాగంగా పర్యటిస్తున్నాం నాలుగు రోజులుగా రాయలసీమలో పర్యటిస్తూ కార్యకర్తలు, నాయకులతో సమీక్ష, సమావేశాలు నిర్వహిస్తున్నాం. కొత్త ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు గడవక ముందే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పొరపాటున ఓటు వేశామని ప్రజలు బాధపడుతున్నారు. మదనపల్లి టమాటా రైతులకు భరోసా ఇవ్వడానికి సమావేశం ఏర్పాటు చేస్తే అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరిస్తుంది. ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా ఇవ్వకపోయినా సమావేశం నిర్వహించి తీరుతాం. జనసేన పార్టీ పదవుల కోసం పెట్టిన పార్టీ కాదు. ప్రజల సంక్షేమం కోసం వచ్చిన పార్టీ. ప్రతి జన సైనికుడు రేపు రైతుల కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని విజయవంతం చేయాలి' అని కోరారు.












Click it and Unblock the Notifications