రుయా ఆస్పత్రిలోకి వరదనీరు, రోగుల ఇబ్బందులు
ఏపీలో వర్ష బీభత్సం కొనసాగింది. వానతో తిరుపతి అతలాకుతలం అయింది. తిరుమల కొండపైనుంచి భారీగా వర్షపు నీరు కిందకు చేరడంతో తిరుపతిలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రుయా ఆసుపత్రిలోకి వరద నీరు చేరింది. హాస్పిటల్లో పలు విభాగాలు నీట మునిగాయి. ఇన్ పేషంట్ వార్డులో రోగులు సురక్షింతగా ఉన్నారు. వరదతో ఎటు చూసినా బురదమయంగా మారింది. వర్షపు నీరు తొలగిపోవడంతో ఆసుపత్రిని శుభ్రం చేస్తున్నారు.
నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో వర్ష ప్రభావం ఉంది. భారీ వర్షాలకు నెల్లూరు జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. జోరు వానతో వరద నీరు ఇళ్లల్లోకి చేరింది. దీంతో పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఎటు చూసిన నీరే కనిపిస్తోంది. సూళ్లూరుపేట, వట్రపాలెంలో కాలనీలు నీట మునిగాయి.

సూళ్లూరుపేటలో కాళంగి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గోకులక్రిష్ణ కాలేజ్ వద్ద జాతీయ రహదారిపైకి భారీగా నీరు చేరింది. దీంతో చెన్నై - కలకత్తా రాకపోకలకు అంతరాయం కలిగింది. శ్రీకాళహస్తి వద్ద కాళంగి డ్యామ్ 18 గేట్లు ఎత్తి 20 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. నీరు దిగువనకు రావడంతో వట్రపాలెం నీట మునిగింది. ముంపు ప్రభావంతో 8 పునరావాస కాలనీల్లో 5 వందల మందికి ఆశ్రయం కల్పించారు. ఇంకొంత మంది తమ ఇళ్లలోనే ఉండిపోయారు.
పంట చేతికి వచ్చే సమయంలో కురుస్తోన్న వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వరి పంట చేతికి వచ్చింది. వర్షాలు పడటంతో.. నీటితో తడిగా ఉంటుంది. దీంతో మిషన్ల ద్వారా కోత మరింత కష్టం అవుతుంది. వరుణ దేవ తమను కరుణించు అని అన్నదాతలు వేడుకుంటున్నారు. కానీ తుపానులు, అల్పపీడనలు ఏర్పడుతున్నాయి. దీంతో రైతన్న బిక్కు బిక్కుమంటున్నాడు.












Click it and Unblock the Notifications