ఏం సాధించారని అద్దె మనుషులతో ప్లీనరీ నిర్వహిస్తున్నారు: చంద్రబాబు
''ఏం సాధించారని అద్దె మనుషులతో ప్లీనరీ నిర్వహిస్తున్నారని'' తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ''జగన్మోహన్రెడ్డే శాశ్వత అధ్యక్షుడిగా ఉంటారా? అదేం పార్టీ? అదేం ప్రజాస్వామ్యం? .. రెండు సంవత్సరాలకోసారి ప్లీనరీ నిర్వహించుకొని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది'' అంటూ చెప్పారు. 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో జరిగిన రోడ్షోలో బాబు మాట్లాడారు.
అదేం పార్టీ?.. అదేం ప్రజాస్వామ్యం?
''తన తల్లి విజయమ్మతో రాజీనామా చేయించారు.. ఆయనే శాశ్వత అధ్యక్షుడిగా ఉంటారంట.. పార్టీలో ఇక ఎన్నికలే ఉండవంట.. అందుకు తీర్మానం చేయించుకుంటారంట.. ఎవరికైనా ఇలాంటి ఆలోచనలు వస్తాయా? అదేం పార్టీ? అదేం ప్రజాస్వామ్యం'' అంటూ బాబు మండిపడ్డారు. బాబాయిని హత్య చేయించారని, తల్లిని, చెల్లిని సాగనంపారని, జగన్ చేసినట్లుగా ఇలాంటి పనులు ఎవరైనా చేయగలరా? అంటూ ప్రశ్నించారు.
ప్రశ్నిస్తే నాపైనే కేసులు పెడుతున్నారు
తాను అధికారంలో ఉండివుంటే రాయలసీమలోని నదులన్నింటినీ అనుసంధానం చేసేవాడినని, రాయలసీమ సస్యశ్యామలమై ఉండేదన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజలను మోసం చేశారనేది 100 శాతం నిజమని, అభివృద్ధి పనులు చేయడంలేదని, ఎందుకు చేయడంలేదంటూ ప్రశ్నించినవారిపై కేసులు పెడుతున్నారని, పెగాసస్ ఉపయోగించానంటూ తనపై కూడా కేసు పెట్టారని, తాను తప్పు చేస్తే ప్రజలకు భయపడతానుకానీ కేసులకు కాదని బాబు చెప్పారు.
టీడీపీ అధికారంలోకి రాగానే డీఎస్సీ
అసత్యాలు ప్రచారం చేసేందుకు ఒక్కో వాలంటీర్కు రూ.200 ఇచ్చి 'సాక్షి' పత్రికను కొనుగోలు చేయిస్తారంట అంటూ ఎద్దేవా చేశారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే డీఎస్సీ నియామకాలు చేపడతామన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడానికి వస్తే రైతులంతా తిరగబడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతి రైతుకు తెలుగుదేశం పార్టీ అండగా నిలబడుతుందన్నారు.
జగన్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టే సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించినప్పుడు కూడా పరదాలు కట్టుకొని తిరిగారంటూ ధ్వజమెత్తారు. రోడ్ షోలో బాబుతోపాటు మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డి, గాలి భానుప్రకాష్రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.