వేడెక్కిన కుప్పం: సర్వశక్తులూ ఒడ్డుతోన్న మంత్రి పెద్దిరెడ్డి..నారా లోకేష్: మాటలు తూటాల్లా
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం.. చిత్తూరు జిల్లాలోని కుప్పం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కుప్పం మున్సిపాలిటీకి నిర్వహించనున్న ఎన్నికలపై అందరి దృష్టీ నిలిచింది. ఎంపీీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల దూకుడును మున్సిపాలిటీ పోలింగ్లోనూ కొనసాగించడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాయాత్తమౌతోంది. ఆ పార్టీని నిలువరించడానికి, పట్టు నిలుపుకోవడానికీ తెలుగుదేశం మల్లగుల్లాలు పడుతోంది. ఈ రెండు పార్టీల పోటాపోటీ ప్రచారంతో కుప్పం నియోజకవర్గం వేడెక్కింది.
కుప్పం కోసం సర్వశక్తులూ
కుప్పం నియోజకవర్గంపై ఆధిపత్యాన్ని సాధించడానికి అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఉత్కంఠ పోరు నెలకొంది. ఈ రెండు పార్టీల నాయకులు సర్వశక్తులనూ ఒడ్డుతున్నారు. ఇదివరకు కుప్పంలో సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకున్న వైఎస్ఆర్సీపీ ఇప్పుడు మున్సిపాలిటీపై జెండా ఎగురవేయడానికి సమాయాత్తమౌతోంది. స్థానిక సంస్థల ఎన్నికలతో బీటలు వారిన కుప్పం కోటను కూల్చేయడానికి కసరత్తు చేస్తోంది. మున్సిపాలిటీని కైవసం చేసుకోగలిగితే.. టీడీపీకి నిలువ నీడ ఉండదనేది వైసీపీ నాయకుల అభిప్రాయం. దాన్ని సాధించడానికి ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు.
పెద్దిరెడ్డి మకాం..
కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎదుర్కొనాల్సిన ప్రధాన అడ్డంకి వైసీపీ సీనియర్ నాయకుడు, పంచాయతీ రాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. కుప్పం నియోజకవర్గం పరిధిలో టీడీపీ బలహీన పడటానికి ఆయన వేసిన రాజకీయ ఎత్తుగడలే కారణం. బద్వేలు అసెంబ్లీ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికలో వైసీపీకి 90 వేలకుపైగా మెజారిటీ రావడానికి పెద్దిరెడ్డి రూపొందించిన వ్యూహాలే మళ్లీ కారణం అయ్యాయి. ఇప్పుడు కూడా కుప్పం మున్సిపల్ ఎన్నిక బాధ్యతను ఆయన స్వీకరించారు. అక్కడే మకాం వేశారు. ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహిస్తోన్నారు.
బరిలో దిగిన నారా లోకేష్..
తెలుగుదేశం పార్టీ తరఫున ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ కుప్పం ప్రచార బరిలో దిగారు. ఈ ఉదయం నుంచి ఆయన కుప్పంలో విస్తృతంగా ప్రచారం చేస్తోన్నారు. బహిరంగ సభలను నిర్వహిస్తోన్నారు. రోడ్ షోలను చేపట్టారు. చంద్రబాబు నాయుడి వారసుడిగా సుదీర్ఘవిరామం తరువాత ఆయన కుప్పంలో పర్యటిస్తోండటం పట్ల టీడీపీ క్యాడర్లో జోష్ నెలకొంది. గ్రామ పంచాయతీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గానీ, నారా లోకేష్ గానీ ప్రచారానికి రాలేదు. వాటి ఫలితాలు తేడా కొట్టడంతో కనీసం మున్సిపాలిటీనైనా నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో నారా లోకేష్ ఎంట్రీ ఇచ్చారు.
పోటా పోటీ ప్రచారాలు..
ప్రస్తుతం
మంత్రి
పెద్దిరెడ్డి
రామచంద్రారెడ్డి
కుప్పంలో
పర్యటిస్తోన్నారు.
విస్తృతంగా
ప్రచారం
నిర్వహించారు.
తమ
ప్రభుత్వం
అమలు
చేస్తోన్న
సంక్షేమ
పథకాలను
ఆయన
ఇంటింటికీ
ప్రచారం
చేస్తోన్నారు.
చంద్రబాబు
వైఫల్యాలను
ఎండగడుతున్నారు.
చంద్రబాబు
పిచ్చి
పతాకస్థాయికి
చేరిందని
విమర్శించారు.
విశ్వాసఘాతుకానికి,
మోసానికి
ప్రతిరూపం
అని
ధ్వజమెత్తారు.
తమ
ప్రభుత్వం
అమలు
చేస్తోన్న
సంక్షేమ
పథకాలు
చూసి
ఓర్చుకోలేక
అసహనంతో
చంద్రబాబు
మాట్లాడుతున్నాడని
మండిపడ్డారు.
కుప్పం
ప్రజలు
తమ
పార్టీ
వెంటే
ఉన్నారని,
కౌంటింగ్
తరువాత
చంద్రబాబు
కుప్పంలో
అడుగు
పెట్టలేరని
అన్నారు.
కుప్పంలో గూండాలు..
పెద్దిరెడ్డికి ధీటుగా నారా లోకేష్ తన రోడ్ షోలను నిర్వహిస్తోన్నారు. కుప్పం ప్రజలు చంద్రబాబును దేవుడిలా భావిస్తుంటారని, ఆయనను ఓడించడానికి అధికార పార్టీ నాయకులు పొరుగు జిల్లాల నుంచి రౌడీలు, గూండాలను దింపారని ఆరోపించారు. వైసీపీ నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా.. తమ పార్టీ గెలిచి తీరుతుందని స్పష్టం చేశారు. కుప్పాన్ని చంద్రబాబు ఎంతో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. ఆయన చేసిన అభివృద్ధి పనులే టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తారని చెప్పారు. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దారని చెప్పారు.