సిగ్గుతో తలదించుకుంటున్నా.. మరీ అంబులెన్సులు ఎందుకు..? రఘురామ హాట్ కామెంట్స్
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఈ సారి కరోనా బాధితుడి గోస గురించి ప్రస్తావించారు. ఎంపీ సొంత ఊరిలో కరోనా బాధితుడిని ఇటీవల చెత్త వేసే మున్సిపాలిటీ బండిలో తీసుకొచ్చారు. ఈ ఘటనతో సిగ్గు పడుతున్నానని పేర్కొన్నారు. తన సొంతూరిలో జరిగిన ఇన్సిడెంట్ తనను తలదించుకునేలా చేసిందన్నారు. ఇటీవలే ప్రారంభించిన అంబులెన్సులు ఏమయ్యాయని రఘురామ ప్రశ్నించారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.

అంబులెన్స్లు ఎందుకు మరీ..?
ఆ అంబులెన్సులు అవసరానికి ఉపయోగపడటం లేదన్నారు. తనను క్షమించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. అంబులెన్సులు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏపీలో పరిస్థితులను కేంద్ర ఆరోగ్య సెక్రటరీ రాజేశ్ భూషణ్ని కలిసి వివరించానని తెలిపారు.

15వ ప్లేస్ నుంచి 4..
కరోనా కేసుల్లో తొలుత 15వ స్థానంలో ఉన్న ఏపీ.. ఇప్పుడు 4వ స్థానంలోకి వెళ్లిందని చెప్పారు. మరికొద్దిరోజుల్లో రెండో స్థానానికి వెళ్లిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులపై కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రితో సమావేశమై.. వివరిస్తామని చెప్పారు. యాంటీబాడీ టెస్టులతో ఆలస్యం అవుతోందని చెప్పారు. ఏడు రోజులు తర్వాత ఫలితాలు వస్తున్నాయని.. ఈలోపు వైరస్ మరింత వేగంగా స్ప్రెడ్ అవుతోందన్నారు.

వెబ్ సెమినార్
అధికారులు, ఎంపీలతో సీఎం వెబ్ సెమినార్ సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. రోజుకు మూడు జిల్లాల నేతలతో మాట్లాడితే చాలా విషయాలు తెలుస్తాయన్నారు. రాష్ట్రంలో ఇదే పెద్ద సమస్య అని.. దీనిపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించాలన్నారు. రాష్ట్రంలో కొన్నిచోట్ల మాస్క్ లేకుండా తిరుగుతున్నారని గుర్తుచేశారు.

దోపిడీని అరికట్టండి..
ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న దోపిడీని అరికట్టాలన్నారు. ఏలూరు హాస్పిటల్లో ఆక్సిజన్ సెంట్రలైజ్డ్ చేస్తున్నారని.. మిగతాచోట్ల అదేవిధంగా చేస్తే బాగుంటుందని సూచించారు. రాష్టంలో ఆయుర్వేదిక్ చదివిన 8 వేల మంది వైద్యులు ఉన్నారని.. వారి సేవలను వినియోగించుకోవాలని కోరారు. అలాగే 24 గంటల్లో ఫలితాలు వచ్చేలా కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. కరోనాను సమూలంగా అరికట్టాలని సూచించారు.












Click it and Unblock the Notifications