వంశీ రెండో లేఖకు చంద్రబాబు సమాధానం ... బుజ్జగించేందుకు రంగంలోకి అధిష్టానం
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు వల్లభనేని వంశీ రాజీనామా వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వల్లభనేని వంశీ తనపై, తన అనుచరులపై వేధింపులు కొనసాగుతున్నాయని, అందుకే రాజకీయాల నుండి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నానని రాజీనామా లేఖ టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపించగా, చంద్రబాబు స్పందిస్తూ రాజీనామాపై పునరాలోచించాలని సూచించారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు రాసిన లేఖ పై వల్లభనేని వంశీ మరోమారు స్పందించారు. కనిపించని శత్రువుతో యుద్ధం చేయడం కష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక వల్లభనేని వంశీ రాసిన రెండవ లేఖపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోమారు చంద్రబాబు స్పందించారు. దీంతో వీరి లేఖల రాయబారాలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి.
పోరాటం చెయ్యండి .. రాజీనామా నిర్ణయంపై పునరాలోచించండి.. వంశీ లేఖకు చంద్రబాబు రిప్లై..
వల్లభనేని వంశీ రాసిన రెండో లేఖపై స్పందించిన చంద్రబాబు తిరిగి ఆయన రాసిన లేఖలో మీరు చేసిన పోరాటాలు పార్టీకి గుర్తున్నాయి అని, నాడు మీరు చేసిన పోరాటాలకు మద్దతుగా తాను నిలిచానని పేర్కొన్నారు. అంతేకాదు మీకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేందుకు మీకు పార్టీతోపాటు తాను కూడా మద్దతుగా ఉంటామని చెప్పిన చంద్రబాబు ఎంపీ కేశినేని నానితో, మాజీ ఎంపీ కొనకళ్ల సత్యనారాయణతో చర్చించండి అంటూ పేర్కొన్నారు. ప్రభుత్వ దుందుడుకు విధానంపై పోరాటం సాగిద్దాం అని వంశీని బుజ్జగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వంశీ పట్ల పార్టీకి, తనకు ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేస్తూ చంద్రబాబు లేఖ రాశారు.
దీంతో వల్లభనేని వంశీని బుజ్జగించడానికి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే వంశీని బుజ్జగించడానికి కేశినేని నాని, కొనకళ్ల సత్యనారాయణ రంగంలోకి దిగారు. వంశీ ఆవేదనతో చంద్రబాబుకు లేఖ రాశారని, వంశీతో పార్టీ ప్రతినిధులు చర్చిస్తారని టిడిపి నేతలు వంశీ పార్టీని వీడి వెళ్లేది లేదని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వంశీని బుజ్జగించేందుకు టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగిన నేపథ్యంలో వంశి తన నిర్ణయం మార్చుకుంటారా, టీడీపీతో కలిసి సాగుతారా ? లేక రాజీనామా నిర్ణయానికి కట్టుబడి ఉంటారా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ గన్నవరం నియోజకవర్గంలో బలమైన నేతగా, కృష్ణాజిల్లా రాజకీయాలలో కీలకమైన వ్యక్తి గా ఉన్న వల్లభనేని వంశీ వదులుకోవడానికి టీడీపీ అధిష్టానం ఏమాత్రం సిద్ధంగా లేదు అన్నది తాజా లేఖల రాయబారాల ద్వారా అర్థమవుతుంది.