తూర్పు పర్యటనకు వైఎస్ జగన్
రాజమండ్రి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న పథకాల్లో ఒకటి- పింఛన్ల పంపిణీ. వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీ నాడే లబ్దిదారుల ఇళ్లకే వెళ్లి పింఛన్లను అందజేస్తోంది ప్రభుత్వం. మధ్యాహ్నం నాటికి వందశాతం మేర పింఛన్ల పంపిణీ పూర్తవుతోంది. లబ్దిదారులు ఉండే చోటుకే వెళ్లి పింఛన్లను పంపిణీ చేస్తోన్నారు వలంటీర్లు.
ఎన్నికల ప్రచార సమయం ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్ పింఛన్ల మొత్తాన్ని పెంచారు కూడా. ఇదివరకు ఉన్న 2,500 రూపాయల పింఛన్ మొత్తానికి అదనంగా 250 రూపాయలను చేర్చారు. మొత్తంగా 2,750 రూపాయల మొత్తాన్ని లబ్దిదారులకు పింఛన్ల రూపంలో అందజేస్తోన్నారు. ఈ కార్యక్రమం వైఎస్ఆర్సీపీ క్యాడర్ లో నూతనోత్సాహాన్ని నింపింది.
ఈ పరిణామాలతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పింఛన్ల వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో వైఎస్ జగన్ స్వయంగా పాల్గొనబోతోన్నారు. దీనికోసం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి వెళ్లనున్నారు. మంగళవారం రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపుదల, లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.
ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరుతారు. 11 గంటలకు రాజమహేంద్రవరానికి చేరుకుంటారు. 11:20 నిమిషాలకు రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పింఛన్ వారోత్సవాలు, బహిరంగ సభలో పాల్గొంటారు. లబ్దిదారులతో ముఖాముఖిగా సమావేశమౌతారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కార్యక్రమం ముగిసిన అనంతరం మధ్యాహ్నం 1.40 నిమిషాలకు అక్కడి నుంచి బయలుదేరి 2:40 నిమిషాలకు తాడేపల్లికి చేరుకుంటారు.