ఏపీ ఎమ్మెల్సీలుగా జకియా, రవీంద్రబాబు - నామినేట్ చేస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ..
ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో కొత్తగా ఇద్దరిని నామినేట్ చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాలు జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు, కడప జిల్లా రాయచోటికి చెందిన జకియా ఖానమ్ ఇకపై గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కొనసాగనున్నారు.
కంతేటి సత్యనారాయణ రాజు, రత్నబాయి పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో వారి స్థానంలో కొత్తగా జకియా ఖానమ్, పండుల రవీద్రబాబును ఎమ్మెల్సీలుగా గవర్నర్ నామినేట్ చేసినట్లు ఎలక్టోరల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తోన్న గవర్నర్ సెక్రటరీ కే.విజయానంద్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిఫార్సు మేరకు ఈ ఇద్దరినీ గవర్నర్ ఎమ్మెల్సీలుగా నామినేట్ చేశారు.

గతంలో టీడీపీ ఎంపీగా ఉన్న పండుల రవీంద్రబాబు.. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరి టికెట్ ఆశించి భంగపడ్డారు. అయితే, మరో విధంగా న్యాయం చేస్తానని అధినేత జగన్ హామీ ఇచ్చిన మేరకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఇక కడప జిల్లాకు చెందిన జకియా ఖానుమ్ భర్త(అఫ్జల్ ఖాన్) పార్టీ కోసం పని చేస్తూ చనిపోయారు. అందుకే ఆమెకు ఈ పదవి ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలను పార్టీ నేతలు అభినందించారు.
మిగతా నేతల్లాగా అధికారంలోకి ఇచ్చిన మాటను మర్చిపోకుండా, సీఎం వైఎస్ జగన్ తనను ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం సంతోషం కలిగించిందని, దళిత, గిరిజన, బలహీన వర్గాలకు అండగా జగన్ వెంట నడుస్తానని రవీంద్రబాబు తన నామినేషన్ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ముస్లిం మైనారిటీ మహిళగా ఉన్న తనకు ముఖ్యమంత్రి జగన్ గురుతర బాధ్యతలు అప్పగించారని, ఈ పదవిని మహిళా సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తానని, చట్ట సభలో ముస్లిం మైనార్టీ మహిళల తరఫున తన వాణిని వినిపిస్తానని జకియా ఖానమ్ నామినేషన్ సందర్భంగా అన్నారు. ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డితోకలిసి రాయచోటి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications