ఏలూరు కార్పోరేషన్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్- పోలింగ్కు రెండ్రోజుల ముందు సంచలనం
ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు ఒక్క రోజు మాత్రమే గడువు మిగిలున్న నేపథ్యంలో హైకోర్టు ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏలూరు మున్సిపల్ కార్పోరేషన్లో ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇక్కడ ఎల్లుండి పోలింగ్ ప్రక్రియకు బ్రేక్ పడింది.
ఏలూరు కార్పోరేషన్ పరిధిలో 50 డివిజన్లకు జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను సవాల్ చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. వార్డుల పునర్విభజనతో పాటు జన గణన, కుల గణన సరిగా చేయలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇలాగే ఎన్నికలు నిర్వహిస్తే చాలా మందికి అన్యాయం జరుగుతుందని వాదించారు. దీంతో ఈ వాదనతో ఏకీభవించిన హైకోర్టు ఎన్నికలను వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ల జాబితా సక్రమంగా ఎన్నికలు నిర్వహించడం సరికాదనే అభిప్రాయాన్ని హైకోర్టు వ్యక్తం చేసింది.
ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల కోసం రూపొందించిన ఓటర్ల జాబితాను సరి చేయాలని కూడా హైకోర్టు ఇవాళ ఆధేశాలు ఇచ్చింది. ఓటర్ల జాబితాలో అక్రమాలపై న్యాయవాది వెంకటేశ్వరరావు వాదనలు విన్న హైకోర్టు.. ఎస్ఈసీ వాదన కూడా విన్న తర్వాత ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఏలూరు కార్పోరేషన్ ఎన్నికలు చివరి నిమిషంలో ఆగిపోవడంతో ఆ పార్టీ తీవ్ర నిరుత్సాహంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కోసం డివిజన్ల పునర్విభజనను హడావిడిగా పూర్తి చేయడమే హైకోర్టు తాజా నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది.