నేడు అరుదైన కోటి సోమవారం: పాటించాల్సిన నియమాలు ఇవే
అమరావతి: నేడు కోటి సోమవారం. ఈ కార్తీకమాసం తొలి సోమవారం కూడా నేడే. ఇలా ఈ రెండు కలిసి రావడం అరుదుగా సంభవిస్తుంటుంది. దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది. రోజంతా ఆహారాన్ని త్యజిస్తే- ఉంటే కోటి సోమవారాల్లో ఉపవాసం ఉన్నంత ఫలితం దక్కుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు.
కార్తీక మాసంలో సోమవారం రోజున సప్తమి తిథి, శ్రవణ నక్షత్రం కలిసి రావడాన్ని కోటి సోమవారంగా పిలుస్తారు. కార్తిక మాసం.. శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైనది. అందులోనూ సోమవారం అంటే ఆధ్యాత్మిక పరంగా ఆ రోజును ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ మాసంలో భక్తులు భక్తి శ్రద్ధలతో అన్ని సోమవారాలు ఉపవాసం ఉండటం ఆనవాయితీ.

ఈ ఏడాది కార్తీక మాసంలో సప్తమి తిథి, శ్రవణ నక్షత్రం రోజున సోమవారం రావాడం అరుదు. ఆధ్యాత్మికపరంగా ఎంతో విశిష్ఠమైన ముహుర్తంలో వస్తున్నందున ఈ సోమవారాన్ని కోటి సోమవారంగా భావిస్తారు. ఈ రోజు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుందని పెద్దలు చెబుతుంటారు.
ఈ కార్తీకమాసంలో శ్రావణ నక్షత్రం ఈ నెల 18వ తేదీన అర్ధరాత్రి దాటిన తరువాత 1:18 నిమిషాలకు ప్రారంభమౌతుంది. 19 రాత్రి 11:51 నిమిషాలకు ముగుస్తుంది. ఈ రోజు ఉపవాసం ఉంటూ శివాలయాలను సందర్శించుకోవడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. సాయంత్రం ప్రదోష కాల సమయంలో దీపారాధన చేయాలి.
కార్తిక మాసంలో నది/ సముద్ర స్నానానికి ఎంతో ప్రత్యేకత ఉంది. నదీ స్నానం అనంతరం ఉపవాసం ఉండటం, దీపారాధన, దీప దానం, సాలగ్రామ పూజ, వన సమారాధనలు ఈ నెల పొడవునా అచరిస్తారు. కార్తిక మాసంలో శ్రీమహా విష్ణువు నదులు, చెరువుల్లో నివసిస్తాడని విశ్వసిస్తారు.
అందుకే ఈ మాసంలో నదీ స్నానానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. నదీ స్నానం కుదరనప్పుడు కార్తీక మాసంలో అన్ని రోజుల్లోనూ సూర్యోదయానికి ముందే చన్నీటి స్నానం చేయాలి. గంగ, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మద, తపతి, సింధు నదులను స్మరించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం, మాంసాన్ని ముట్టుకోకూడదు.
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఈ తెల్లవారు జాము నుంచే పూజాదికాలు మొదలయ్యాయి. 3 గంటలకు అర్చకులు ప్రాతఃకాల పూజలు, ఆర్జిత చండీ హోమం, రుద్ర హోమం నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గర్భాలయ ఆర్జిత అభిషేకం, సామూహిక ఆర్జిత అభిషేకాన్ని రద్దు చేశారు.












Click it and Unblock the Notifications