రాజధాని అమరావతి పోరాటం... మనస్తాపంతో ఆగిన మరో రైతు గుండె
రాజధాని అమరావతిలోనే కొనసాగించాలంటూ అమరావతి 29 గ్రామాల రైతులు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు . ప్రస్తుతం అమరావతి చుట్టూ ఉన్న 29 గ్రామాల రైతులు సకలజనుల సమ్మె చేస్తున్నారు. నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతంగా కొనసాగిస్తున్నారు. ఉద్యమం తీవ్రతరమై దాడుల దాకా వెళ్తున్నా ప్రభుత్వం మాత్రం దీనిపై స్పందించటం లేదు .ఇక రాజధాని కోసం పోరాటం చేస్తూ ఆందోళనల్లో పాల్గొంటున్న రైతుల కుటుంబాల్లో విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

కృష్ణాయపాలెంలో రైతు మృతి
రాజధానిలో రైతులు, కౌలు రైతులు తీవ్ర మానసిక వేదనతో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇక నేడు రాజధాని కోసం పోరాటం చేస్తున్న మరో రైతు గుండె ఆగింది. రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో మరో రైతు నేడు ప్రాణాలు కోల్పోయారు . బుధవారం తెల్లవారుజామున కృష్ణాయపాలెంలో రైతు అద్దేపల్లి కృపానందం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన గత మూడు రోజులుగా రాజధాని ఆందోళనలో పాల్గొన్నారు.

రాజధాని తరలిపోతుందన్న మనస్థాపంతో గుండెపోటు
రాజధాని అమరావతి నుండి వెళ్ళిపోతే జీవనం ఎలా అన్న ఆందోళనలో ఉన్న రాజధాని ప్రాంత రైతులు తీవ్రమనస్తాపానికి గురవుతున్నారు. ఇదే క్రమంలో రాజధాని నిర్మాణం కోసం కృపానందం అరఎకరం పొలం ఇచ్చారు. ఇప్పుడు రాజధాని తరలిపోతే తన పరిస్థితి ఏంటి అన్న ఆందోళనలో గుండెపోటుకు గురై ఆయన కన్ను మూశారు. మొన్నటికి మొన్న తుళ్లూరు మండలం దొండపాడుకు చెందిన మల్లికార్జునరావు అనే రైతు గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. అప్పటి ప్రభుత్వం రాజధాని కోసం చేసిన ల్యాండ్ పూలింగ్కి సదరు రైతు 10 ఎకరాలు ఇచ్చినట్టు సమాచారం.

రైతుల మరణాలతో రాజధాని ప్రజల్లో ఆగ్రహావేశాలు
ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానుల ప్రకటనపై వెల్లువెత్తుతున్న నిరసనలు నేటితో 22వ రోజుకు చేరాయి. రాజధాని రైతుల పోరాటం ఇప్పటికీ ఉధృతంగా సాగుతుంది. రాజధాని రైతులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తున్నా రాజధాని రైతుల పోరాటం మాత్రం ఆగటం లేదు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని 29 రాజధాని గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక రైతుల మరణాలు రాజధాని ప్రజల్లో మరింత ఆగ్రహావేశాలను కలిగిస్తున్నాయి.












Click it and Unblock the Notifications