మాచర్ల ఘటనపై డీజీపీకి, ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ .. స్పందించిన డీజీపీ
మాచర్లలో టీడీపీ నేతలు బుద్దా వెంకన్న ,బోండా ఉమాలపై దాడి ఘటన పై టీడీపీ అధినేత సీరియస్ అయ్యారు. డీజీపీ సమాధానం చెప్పాలన్నారు. పోలీసు వ్యవస్థ ఉందా అని ప్రశ్నించారు. ఇక ఇంతా జరుగుతున్నా ఎన్నికల సంఘానికి పట్టదా ? అని ప్రశ్నించారు. ఇక ఈ నేపధ్యంలోనే మాచర్ల ఘటనపై డీజీపీ, ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు లేఖాస్త్రం సంధించారు . బోండా ఉమ, బుద్దా వెంకన్నపై హత్యాయత్నం జరిగిందని తాను రాసిన లేఖలో పేర్కొన్నారు.

శాంతిభద్రతలు సరిగా లేవని డీజీపీకి లేఖ రాసిన చంద్రబాబు
రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవని అందుకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. శాంతి భద్రతలు సరిగా లేనందువల్లే ఈ ఘటన జరిగిందని లేఖలో పేర్కొన్నారు. పోలీసుల్లో ఓ వర్గం అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తోందని చంద్రబాబు లేఖలో తెలిపారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతిపక్షంపై అధికార పార్టీ నేతల దాడులు అరికట్టాలని తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పారు చంద్రబాబు .
ఎన్నికల సంఘానికి చంద్రబాబు ఫిర్యాదు
వైసీపీ దాడుల నియంత్రణకు ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలివ్వాలని ఆయన డీజీపీని కోరారు. టీడీపీ నేతలకు తగిన భద్రత కల్పించాలని పేర్కొన్నారు. ఇక ఎన్నికల సంఘం నామినేషన్లు వెయ్యనీకుండా నామినేషన్ పత్రాలు చించటం , టీడీపీ నేతలపై దాడులు చెయ్యటం , ఏకంగా టీడీపీ ముఖ్య నాయకులపై హత్యా యత్నానికి పాల్పడటం వంటి ఘటనలను సీరియస్ గా తీసుకోవాలని కోరార్. తక్షణ చర్యలకు డీజీపీకి ఆదేశాలు ఇవ్వాలని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.

స్పందించిన డీజీపీ గౌతమ్ సవాంగ్ .. నివేదిక ఇవ్వాలని ఐజీకి ఆదేశం
మాచర్ల సంఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. అసలు సంఘటనపై నివేదిక కావాలని ఆదేశించారు. సంఘటన స్థలానికి జిల్లా ఎస్పీ చేరుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకుని పూర్తి నివేదిక ఇవ్వాలని డీజీపీ సవాంగ్ గుంటూరు ఐజీని ఆదేశించారు. డీజీపీ ఆదేశాలతో గుంటూరు ఐజీ మాచర్లకు బయల్దేరారు. అసలు ఈ ఘటనపై పూర్తి నివేదిక వచ్చిన తర్వాత డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించే అవకాశం ఉంది .












Click it and Unblock the Notifications