ఇసుక వారోత్సవాలు సిగ్గుచేటన్న బాబు .. ఇసుకాసురుల భరతం పట్టే వారోత్సవాలు చెయ్యాలని ఫైర్
ఏపీలో ఇసుక సమస్య తీవ్రం కావడంతో ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ పై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నాయి. ఇసుక కోసం పోరు బాట పట్టాయి. ఇసుక కొరతతో నిర్మాణ రంగం కుదేలైంది అని, నిర్మాణ రంగ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, పనులు లేక, తిండి లేక పస్తులు ఉంటున్నారు అని ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్న ప్రతిపక్ష పార్టీలు ఇసుక కోసం పోరాటం చేయడానికి కార్యాచరణను రూపొందించుకున్నాయి.

ఇసుకపై యుద్ధం ... వైసీపీ వర్సెస్ ప్రతిపక్షాలు
ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నవంబర్ 3వ తేదీన విశాఖ కేంద్రంగా భవన నిర్మాణ కార్మికుల కోసం, ఇసుక కొరత పై చేస్తున్న పోరాటంలో భాగంగా లాంగ్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ ఏపీలో నెలకొన్న ఇసుక కొరత పై పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూనే ఉంది. ఇక తాజాగా ఇసుక విషయంలో సమీక్ష నిర్వహించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇసుక కొరతను నివారించడానికి ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు అందరూ ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని, ప్రతిపక్ష పార్టీలకు ఇసుక పై నోరు ఎత్తడానికి అవకాశం ఇవ్వద్దని పేర్కొన్నారు.

ఇసుకవారోత్సవాలు సిగ్గు చేటు అన్న బాబు
ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో ఇసుక వారోత్సవాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.రాష్ట్రంలో ఇసుక వారోత్సవాలు కాదు నిర్వహించాల్సింది. ఇసుకాసురుల భరతం పట్టే వారోత్సవాలు నిర్వహించాలని ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసి మాట్లాడారు. ఊరికొక వైసీపీ ఇసుకాసురుడు తయారయ్యాడని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీలో కార్మికుల ఆత్మహత్యలు.. ప్రభుత్వ హత్యలే అని ఆగ్రహం
అంతేకాదు ఇసుక కొరత వల్ల ఏపీలో నిర్మాణ రంగ కార్మికుల ఆత్మహత్యల బాట పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు ఇప్పటివరకు ఆరుగురు కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఈ ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలు అంటూ ఆయన ఆరోపించారు. పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ఏపీలో ఇసుకాసురుల భరతం పడితేనే నిజమైన దీపావళి పండుగ అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో లేనటువంటి ఇసుక కొరత ఏపీలోనే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు చంద్రబాబు.

వైసీపీ నేతలే ఇసుకాసురులు అంటూ మండిపాటు
గత పాలసీని రద్దుచేసి, నిర్మాణ రంగ కార్మికులను ఆత్మహత్యలకు ప్రేరేపించే కొత్త పాలసీలను తీసుకొస్తారా అంటూ నూతన ఇసుక విధానంపై నిప్పులు చెరిగారు చంద్రబాబు. ఇసుక నియంత్రణ పేరుతో వైసీపీ నేతలు తమ జేబులు నింపుకుంటున్నారు అని ఆరోపణలు గుప్పించారు. వైసీపీ నేతలే ఇసుకాసురులు అంటూ మండిపడ్డారు. గ్రామాలలో ఉన్న వాగులలో ఇసుక తీసుకువెళ్లడానికి కూడా అనుమతులు కావాలా అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉపాధి కోల్పోయిన కార్మికులకు నెలకు10వేల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్
ఏపీ ప్రభుత్వ వైఫల్యం వల్ల పనులు కోల్పోయిన నిర్మాణ రంగ కార్మికులకు నెలకు పది వేల రూపాయల పరిహారం ఇవ్వాలని, కార్మిక సంఘాలతో కలిసి ప్రస్తుత సమస్యను పరిష్కరించడానికి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఏపీ రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత ఏపీ ప్రభుత్వ అసమర్థ పాలనకు, వైసిపి నేతల అవినీతికి తార్కాణం అన్న చంద్రబాబు ఇసుక వారోత్సవాల పేరుతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సిగ్గుచేటు అంటూ ఫైర్ అయ్యారు.












Click it and Unblock the Notifications