తిరగబడ్డ వలస కార్మికులు : మంగళగిరిలో ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్ల దాడి..
గుంటూరు జిల్లా మంగళగిరిలో శుక్రవారం(మే 8) తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎయిమ్స్ వద్ద వలస కార్మికులు,పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో పలువురు వలస కార్మికులు పోలీసులపై రాళ్ల దాడికి దిగినట్టు తెలుస్తోంది. కొంతమంది ఆందోళనకారులు ఎయిమ్స్ సెక్యూరిటీ గదిలో ఫర్నీచర్ కూడా ధ్వంసం చేసినట్టు సమాచారం. అడిషనల్ ఎస్పీ ఈశ్వరరావు రంగంలోకి దిగి వలస కార్మికులకు నచ్చచెప్పడంతో వారు శాంతించినట్టు తెలుస్తోంది.
మంగళగిరిలో నిర్మిస్తున్న ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో పనిచేసేందుకు వీరంతా వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చారు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఇక్కడే చిక్కుకుపోయారు. నిర్మాణ పనులకు వచ్చిన తమను స్వస్థలాలకు పంపించాలంటూ ఆందోళనకు దిగారు. మూడు రోజుల క్రితమే తమను ఇక్కడినుంచి తరలిస్తామని హామీ ఇచ్చినా.. ఇంతవరకూ ఆ దిశగా చర్యలేవీ తీసుకోలేదని ఆరోపించారు. ఇదే క్రమంలో పోలీసులతో వాగ్వాదం,రాళ్ల దాడి చోటు చేసుకున్నాయి.

మూడు రోజుల క్రితం కూడా వీరంతా తమను స్వస్థలాలకు తరలించాలంటూ ఆందోళనకు దిగారు. బకాయిలు చెల్లించి తమను పంపించేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే 3 రోజుల్లో పంపిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో శాంతించారు. కానీ ఆ దిశగా చర్యలేవీ లేకపోవడంతో మళ్లీ ఆందోళనకు దిగారు. అయితే ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఎక్కువ కరోనా కేసులు ఉన్న కారణంగా రెడ్ జోన్లో ఉందని.. కాబట్టి ఇక్కడినుంచి వెళ్లే వలస కార్మికులను అనుమతించడానికి ఇతర రాష్ట్రాలు సుముఖంగా లేవని అడిషనల్ ఎస్పీ ఈశ్వరరావు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications