చంద్రబాబు సభలో తొక్కిసలాట మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన జగన్- కీలక నిర్ణయం?
గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా పర్యటనలో తొక్కిసలాట చోటు చేసుకుంది. గుంటూరు వికాస్ నగర్ లో ఆయన నిర్వహించిన సభలో సంభవించిన ఈ ఘటనలో ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. సంఘటన స్థలంలో ఓ మహిళ మరణించగా.. మరో ఇద్దరు గుంటూరు జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పలువురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు.
మృతులను గోపిశెట్టి రమాదేవి, గౌసియాగా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియరావాల్సి ఉంది. మొన్నటికి మొన్న నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన సభలో తొక్కిసలాట చోటు చేసుకుని ఎనిమిదిమంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా గుంటూరు వికాస్ నగర్ లో నిర్వహించిన సభ, చంద్రన్న కానుకల పంపిణీ సభలోనూ అలాంటి పరిస్థితే ఏర్పడింది. ఈ సభలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ముగ్గురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

సంక్రాంతి పండగ సమీపిస్తోన్న నేపథ్యంలో చంద్రన్న కానుకల పేరుతో చీరలను పంపిణీ చేయడానికి ఉయ్యూరు ఫౌండేషన్ తరఫున తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కానుకల పంపిణీ చేస్తోన్న సమయంలో- దీనికోసం వచ్చిన వారంతా ఒక్కసారిగా ముందుకు తోసుకుని వచ్చారు. దీనితో తొక్కిసలాట సంభవించింది. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు.
ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి 50,000 రూపాయల చొప్పున నష్ట పరిహారాన్ని ప్రకటించారు. గాయపడిన వారికి నాణ్యమైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రాణనష్టం తగ్గించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. ఇక ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.

వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ ఆసుపత్రికి వెళ్లారు. బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాల వారిని ఓదార్చారు. వారికి అందుతున్న చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాగా- మొన్నీ మధ్యే కందుకూరులో ఇదే చంద్రబాబు రోడ్ షోలో ఎనిమిది మంది, ఇప్పుడు తాజాగా మరో ముగ్గురు మరణించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. చంద్రబాబు నిర్వహించే సభలు, రోడ్ షోలపై ఆంక్షలు విధించేలా కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications