కాశ్మీర్ ఎన్కౌంటర్లో గుంటూరు జవాన్ వీరమరణం: ఆర్థిక సాయాన్ని ప్రకటించిన జగన్ సర్కార్
గుంటూరు: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులతో చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన గుంటూరు జిల్లాకు చెందిన జవాన్ జశ్వంత్ రెడ్డి కుటుంబానికి జగన్ సర్కార్ భారీగా ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఆయన కుటుంబానికి 50 లక్షల రూపాయల సహాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. జశ్వంత్ రెడ్డి కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆర్థిక సాయంగా 50 లక్షల రూపాయలను విడుదల చేయాలని సూచించారు.
జమ్ముకాశ్మీర్ రాజౌరీ సెక్టార్ పరిధిలోని సుందర్బని సమీపంలో ఉగ్రవాదులతో చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన జవాన్ మనుప్రోలు జశ్వంత్రెడ్డి వీరమరణం పొందిన విషయం తెలిసిందే. జశ్వంత్ రెడ్డితో పాటు నాయబ్ సుబేదార్ శ్రీజిత్ కన్నుమూశారు. ఇదే ఎన్కౌంటర్ సందర్భంగా భద్రత బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. రాజౌరీ సుందర్బనీ సెక్టార్లోని దద్దర్ గ్రామంలో ఈ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.

ఈ ఎదురు కాల్పుల్లో గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాద కొత్తపాలెం నివాసి జశ్వంత్ రెడ్డి కన్నుమూశారు. దేశానికి సేవ చేయాలనే అకాంక్షతో జశ్వంత్ రెడ్డి అయిదేళ్ల కిందట ఆర్మీలో చేరారు. తొలుత మద్రాస్ రెజిమెంట్, నీలగిరిల్లో పనిచేశారు. అనంతరం ఆయనను ఆర్మీ అధికారులు జమ్మూకాశ్మీర్కు బదిలీ చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో జశ్వంత్ రెడ్డి వీరమరణం పొందారు. జవాన్ మృతదేహం ఈ రాత్రికి బాపట్లకు చేరుకోవచ్చని ఆర్మీ అధికారుల నుంచి తమకు సమాచారం అందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జశ్వంత్ రెడ్డి అవివాహితుడు. నాలుగు నెలల కిందటే సెలవులపై ఇంటికి వచ్చి వెళ్లారు. అప్పుడే ఆయనకు నిశ్చితార్థం జరిగింది. శ్రావణమాసంలో జశ్వంత్కు పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తోన్నారు. ఇంతలోనే ఉగ్రవాదుల కాల్పుల్లో తమ కుమారుడు మరణించాడన్న విషయం తెలిసి తల్లిదండ్రులు వెంకటేశ్వరమ్మ, శ్రీనివాసరెడ్డి విషాదంలో మునిగిపోయారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జశ్వంత్ రెడ్డి కుటుంబానికి జగన్ సర్కార్ 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా తోడుగా ఉంటామని తెలిపింది.












Click it and Unblock the Notifications