దండుపాళ్యంను మించి.. కర్నూలు గ్యాంగ్పై పోలీసులు
దండుపాళ్యం ముఠా అంటే అంతా భయంకరంగా ఉంటారు. కర్ణాటకలో ఆ ముఠా చేసిన అరాచకాలు కూడా మాములుగా లేవు. అయితే కర్నూలు జిల్లాకు చెందిన బ్యాచ్ వారిని మించి ఉంది అని పోలీసులు అంటున్నారు. గుంటూరు జిల్లా మేడికొండూరులో గత సెప్టెంబర్లో జరిగిన సామూహిక అత్యాచార ఘటనను గుంటూరు రూరల్ పోలీసులు ఛేదించారు. నిందితులు కర్నూలు జిల్లాకు చెందిన గ్యాంగ్గా పోలీసులు గుర్తించారు. ఆదివారం గుంటూరులో మీడియా సమావేశంలో రూరల్ ఎస్పీ నిందితుల వివరాలు వెల్లడించారు.
గ్యాంగ్ రేప్
మేడికొండూరు మండలం పాలడుగు వద్ద మహిళపై గ్యాంగ్ రేప్ చేశారు. ఎనిమిది మంది గల ముఠా సభ్యుల్లో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ వారిలో దాసరి లింగమయ్య, దాసరి ఓబులేసు, దాసరి చిన లింగమయ్య, చెంచుబెత్తల హనుమంతు, దాసరి వెంకన్న, ఇళ్ల రమణయ్య మరొ వ్యక్తి ఉన్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. గుంటూరు రూరల్ పరిధిలోనే వీరు 18 దారి దోపిడీలు, పలు అత్యాచారాలు చేశారని పోలీసు విచారణలో తేలింది.
లారీలను అడ్డుకొని
హైవేపై లారీలను అడ్డుకుని దారి దోపిడీకు పాల్పడడంతోపాటు, ఒంటరి మహిళలను, జంటలను టార్గెట్ చేసుకుని దారుణాలకు ఒడిగట్టినట్లు ఎస్పీ వివరించారు. కర్నూలు జిల్లాకు చెందిన నిందితులు.. గుంటూరు రూరల్ పరిధిలో మిరప కోతలు, కుప్ప నూర్చుడు కూలీ పనులకు వచ్చేవారు. పగలు పొలాల్లో కూలిపనులు చేసుకుంటూ.. రాత్రిళ్ళు దారుణాలకు పాల్పడ్డారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి వచ్చిన అనేక ఫిర్యాదులను పరిశీలించిన రూరల్ ఎస్పీ, డీజీపీ ఆదేశాలతో 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం పటిష్ట గాలింపు చర్యలు చేపట్టారు.
విస్తుపోయే విషయాలు
నిందితుల కోసం వెతుకుతున్న పోలీసులకు పలు విస్తుపోయే విషయాలు తెలిసాయి. చేయబోయే పని గురించి నిందితులు ముందుగానే ఒక నిర్ణయానికి వస్తారని, రెండు మూడు రోజులు ముందుగానే రెక్కి వేస్తారని ఎస్పీ వెల్లడించారు. మెయిన్ రోడ్డు నుంచి దూరంగా ఉండే కొండ ప్రాంతాలలో నివాసం ఏర్పరుచుకుని.. ఎవరికీ అనుమానం రాకుండా అత్యంత జాగ్రత్తగా ఉండేవారు. మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలను వినియోగించేవారు కాదు. ఎంత దూరమైనా కాలినడకన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తారని ఎస్పీ తెలిపారు.
రైళ్లలో వస్తూ.. పోతూ..
పని ఉన్న సమయంలో కర్నూలు నుంచి ట్రెయిన్ లో వస్తూ పోతూ ఉండే వీరు గుంటూరు రూరల్ పరిధిలో పొలాల్లో గుడారాలు ఏర్పాటు చేసుకుంటారు. నిందితులు చేసిన అకృత్యాలపై స్పందించిన ఎస్పీ విశాల్ గున్నీ..వీరు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులుగా పేర్కొన్నారు.