భయోత్పాతం సృష్టిస్తున్నారు, మూడేళ్లే: చంద్రబాబు సంచలనం, టీడీపీ శిబిరం వద్ద భారీగా పోలీసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో జరిగిన టీడీపీ పార్టీ లీగల్ సెల్ సమావేశంలో టీడీపీ ఎంపీ, న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్, 13 జిల్లాలకు చెందిన న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న చంద్రబాబు నాయుడు అనంతరం మీడియాతో మాట్లాడారు.

అదే జరిగితే మూడేళ్లే..
రిడర్స్ టెండరింగ్తో ఏమవుతుందో లేదో తెలియదు కానీ.. రివర్స్ ఎన్నికలు వస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే రివర్స్ పాలన ఉన్నప్పటికీ రివర్స్ ఎన్నికలకు ఆస్కారం లేదని అన్నారు. కానీ, జమిలీ ఎన్నికలకు మాత్రం అవకాశం ఉందని, అదే జరిగితే మూడేళ్లలోనే ఎన్నికలొస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమరావతిని పురిట్లోనే..
ఈ సందర్భంగా సీఎం జగన్పై చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ ఇలాంటి అనాగరిక పరిస్థితులు చూడలేదని, ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి శ్రీకారం చుడితే దాన్ని పురిట్లోనే చంపేశారని మండిపడ్డారు. అవినీతి కేసుల్లో ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తి తనపై ఆరోపణలు చేస్తున్నారని పరోక్షంగా జగన్పై మండిపడ్డారు.

ప్రజల కోసమే అవమానాలు భరిస్తున్నా..
గతంలో తనపై 26 కేసులు పెట్టి ఒక్కటీ నిరూపించుకోలేకపోయారని చంద్రబాబు అన్నారు. తనను ఎన్ని అవమానాలు, ఇబ్బందులు పెట్టినా ప్రజల కోసం భరిస్తానని అన్నారు. రాష్ట్రంలో వైఎస్ హయాంలో కంటే ఎక్కువ దాడులు జరిగాయని, గ్రామాలపై దాడులు చేస్తూ రాక్షసుల్ని మించి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ అవినీతి ఇంకా దొరకలేదా? అంటూ అధికారుల్ని, మంత్రుల్ని కోప్పడే స్థితిలో జగన్ ఉన్నారని ఎద్దేవా చేశారు.

అందుకే చలో ఆత్మకూరు..
వైసీపీ దాడులు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని, ఈ క్రమంలోనే చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చామని చంద్రబాబు తెలిపారు. గతంలోనూ వందలాది మంది టీడీపీ కార్యకర్తలను హతమార్చారని, ఇప్పుడు అంతకుమించి అరాచకం జరుగుతోందని మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలకు అండగా లీగల్ సెల్ నిలిచిందని చెప్పారు. తమపై జరుగుతున్న దాడులపై టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసులు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఈ క్రమంలోనే బాధితులకు అండగా నిలిచేందుకు పునరావాస శిబిరం ఏర్పాటు చేశామని చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చాక 10 హత్యలు, 201 దాడులు, 136 వేధింపులు, 52 అక్రమ కేసులు, 66 ఆస్తుల ధ్వంసం, భూకబ్జాలు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు.

టీడీపీ శిబిరం వద్ద భారీగా పోలీసులు..
ఇది ఇలా ఉండగా, గుంటూరులో టీడీపీ ఏర్పాటు చేసిన పునరావాస శిబిరం పరిసరాల్లో మంగళవారం భారీగా పోలీసులు మోహరించారు. గ్రామాల్లోని వైసీపీ బాధితులుగా పేర్కొంటూ గుంటూరులోని అరండల్పేటలో టీడీపీ ఈ శిబిరాన్ని నిర్వహిస్తోంది. దీంతో 40 వాహనాలను ఈ శిబిరం వద్దకు తీసుకొచ్చిన పోలీసులు.. బాధితులను వారి గ్రామాల్లోకి పంపే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. చలో ఆత్మకూరుకు టీడీపీతోపాటు వైసీపీ కూడా పిలుపునివ్వడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వీరిని తరలించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications