మంగళగిరి, తాడేపల్లిల్లో హైఅలర్ట్: రేపటి నుంచి ఆ 12 గంటలే: రెండు వారాలు నైట్ కర్ఫ్యూ?
గుంటూరు: రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల కథ మళ్లీ మొదటికొచ్చింది. సెకెండ్ వేవ్ ప్రభావం అన్ని జిల్లాలపైనా ఉంది. రోజురోజుకూ కొత్త కేసులు వందల్లో పుట్టుకొస్తున్నాయి. మరణాల సంఖ్యలోనూ అదే తరహా వేగం నెలకొంది. రోజూ వేలల్లోనే కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో విజయవాడలోని వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. ఒకరోజు పాటు తమ వ్యాపార కార్యకలాపాలను నిలిపివేశారు. కరోనా కేసుల ఉధృతిని తగ్గించడానికి ఇలాంటి చర్యలు దోహదపడతాయని అధికారులు భావిస్తున్నారు.
విజయవాడకు ఆనుకుని ఉన్న మంగళగిరి, తాడేపల్లి పరిధిలోనూ కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఇదే తరహా ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. సోమవారం నుంచి పాక్షికంగా లాక్డౌన్ను అమలు చేయాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తెల్లవారు జామున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే దుకాణాలు, ఇతర వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించాలని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
మంగళగిరి శాసన సభ్యుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డితో సమావేశమైన అనంతరం వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనాను కట్టడి చేయడానికి అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోవాల్సి ఉందని, పరిస్థితులు మరింత దిగజారక ముందే కఠిన చర్యలు, నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందని ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. మంగళగిరి, తాడేపల్లి పరిధిలో 15 రోజుల పాటు రాత్రివేళ కర్ఫ్యూను విధించాలని కూడా ఆయన అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. దీన్ని వెంటనే అమలు చేయాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం.
Recommended Video
వైద్య శాఖ అధికారులు శనివారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 7,224 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 16 మంది మరణించారు. 2,332 మంది డిశ్చార్జ్ అయ్యారు. గుంటూరు జిల్లా పరిదిలో 903 కొత్త కేసులు రికార్డయ్యాయి. మరణాల సంఖ్య 690కి చేరింది. ఇప్పటిదాకా ఈ జిల్లాలో నమోదైన మొత్తం కేసులు 85,766 కాగా.. ఇందులో 80,775 మంది కరోనా నుంచి కోలుకుని, డిశ్చార్జ్ అయ్యారు. 4,301 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. మంగళగిరి, తాడేపల్లి పరిధిలో కేసుల తీవ్రత అధికంగా ఉంటోంది.