పథకాలు ఎత్తేస్తామంటే వచ్చారు- వైసీపీ బీసీ సభపై పొన్నూరు రోడ్ షోలో చంద్రబాబు..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం బీసీలకు చేసిన మేలును వివరించేందుకు నిన్న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జయహో బీసీ సభను ఏర్పాటు చేసింది. దీనికి జిల్లాల్లో బీసీ నేతలందరినీ తరలించింది. దీనిపై ఇవాళ పొన్నూరు రోడ్ షోలో చంద్రబాబు విమర్శలు గుప్పించారు. పథకాలు ఎత్తేస్తామని బెదిరించినందునే జనం ఈ సభకు హాజరయ్యారని విమర్శించారు.
పొన్నూరు నియోజకవర్గం నారాకోడూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షో నిర్వహించారు. ఇందులో చంద్రబాబు వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేశారు. నిన్న మొన్నటి వరకు బాదుడే బాదుడు చేశామని, ఇప్పుడు ఇదేం ఖర్మ రాష్ట్రానికి అని కార్యక్రమం మొదలు పెట్టామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ఉన్న పరిస్థితికి సరైన పేరు ఇదేం ఖర్మ అని అన్నారు. జగన్ కు నాలుగేళ్ల తరువాత బీసీలు గుర్తు వచ్చారని ఆరోపించారు. నిన్న మీటింగ్ పెట్టాడన్నారు. నిన్నటి వైసీపీ సభకు జనం ఇష్టపూర్వకంగా రాలేదని, పథకాలు తీసేస్తామని భయపెట్టి తీసుకువచ్చారని చంద్రబాబు విమర్శించారు.
టీడీపీ సభలకు జనం స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని, తమ కోసం రాత్రి వరకు ఉంటున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ సభల నుంచి జనం పారిపోతున్నారన్నారు. తాను ముఖ్యమంత్రి పదవి కోసం ఇక్కడికి రాలేదని, తమ్ముళ్ళ కోసం, రైతుల కోసం, యువత కోసం వచ్చానన్నారు. రాష్ట్రం కోసం వచ్చానన్నారు. సైకో పాలన వద్దు....సైకిల్ పాలన కావాలని చంద్రబాబు నినదించారు. ధూళిపాళ్ళ కుటుంబం నాటి నుండి టీడీపీలో ఉందని, పొన్నూరు లో 9 సార్లు ఎన్నికలు జరిగితే 7 సార్లు గెలిచిన కుటుంబం ధూళిపాళ్ల కుటుంబమని చంద్రబాబు గుర్తుచేశారు. వరుసగా 5 సార్లు గెలిచిన నరేంద్రను అక్రమ కేసులు పెట్టి వేధించారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. జగన్ రెడ్డి ఒక అమూల్ బేబి అని, అమూల్ ఆయనకు ముద్దన్నారు. అప్రమత్తంగా లేకపోతే రాష్ట్రాన్ని కాపాడుకోలేమని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రం కోసం అంతా కలిసి రండి...నేను ముందు ఉండి పోరాడుతానని చంద్రబాబు పిలుపునిచ్చారు.