కోర్టులో లొంగిపోయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు: ఎందుకంటే..?
హైదరాబాద్: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కింజరపు అచ్చెన్నాయుడు శుక్రవారం కోర్టులో లొంగిపోయారు. పోలీసుల విధులను అడ్డుకోవడం, వారి పట్ల దురుసుగా ప్రవర్తించిన వ్యవహారంలో తాడేపల్లి పోలీస్ స్టేషన్లో అచ్చెన్నాయుడుపై కేసు నమోదైన విషయం తెలిసిందే.

కోర్టులో లొంగిపోయిన కింజరపు...
అయితే, ఆ కేసులో అచ్చెన్నాయుడుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో స్థానిక కోర్టులో లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో అచ్చెన్నాయుడు శుక్రవారం మంగళగిరి కోర్టు ఎదుట హాజరయ్యారు. న్యాయమూర్తి ఎదుట లొంగిపోయి సొంతపూచీకత్తుతో బెయిల్పై విడుదలయ్యారు.

చలో ఆత్మకూరు పేరుతో..
సెప్టెంబర్లో చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని నిర్వహించింది టీడీపీ, గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో అధికార వైసీపీ నేతలు టీడీపీ సానుభూతిపరులపై దాడులకు తెగబడుతున్నారని ఆరోపిస్తూ ఈ మేరకు ఆత్మకూరులో నిరసన చేపట్టారు. వైసీపీ నేతల వేధింపులు ఎక్కువయ్యాయని, సొంత గ్రామాల్లో ఉండనివ్వని పరిస్థితి ఉందంటూ.. అలాంటి వారి కోసం వైసీపీ బాధితుల శిబిరం పేరుతో పునరావాసం కూడా కల్పించింది టీడీపీ. వైసీపీ నేతలు, సర్కారు బాధితులకు తాను అండగా ఉంటానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో ఇంత అరాచకం సృష్టిస్తారా? అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలోనే చలో ఆత్మకూరుకు పిలుపునివ్వడంతో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతోపాటు భారీ ఎత్తున నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.

పోలీసులతో వాగ్వాదం
కాగా, ‘చలో ఆత్మకూరు'కు అనుమతులు లేవంటూ పోలీసులు టీడీపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి లోకేష్ను ఉండవల్లిలోని తమ నివాసాల్లోని పోలీసులు నిర్భంధించారు. ఈ క్రమంలో అచ్చెన్నాయుడుతోపాటు మరికొంతమంది టీడీపీ నేతలు అక్కడికి చేరుకున్నారు.
చంద్రబాబును కలిసేందుకు అచ్చెన్నాయుడు ప్రయత్నించగా.. ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. తమ అధినేతను కలవకుండానే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పోలీసులపై అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చలో ఆత్మకూరు నేపథ్యంలో ఉండవల్లిలో కూడా ఆంక్షలు అమల్లో ఉన్నాయని పోలీసులు చెప్పినా వినకుండా లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు.

దురుసుగా ప్రవర్తించారంటూ కేసు
అచ్చెన్నాయుడును పోలీసులు లోనికి పోనీయకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులపై కోపంతో ఊగిపోయిన అచ్చెన్నాయుడు.. వారితో వాగ్వాదానికి దిగాడు. వారితో దుర్భాషలాడుతూ వారిని తోసుకుని వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో అచ్చెన్నాయుడుపై విధులకు ఆటంకం కలిగించారని, దురుసుగా ప్రవర్తించారంటూ కేసు నమోదు చేసి, జైలుకు తరలించారు. ఆ తర్వాత ఆయన హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందారు. అయితే హైకోర్టు స్థానిక కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. ఈ క్రమంలో మంగళగిరి కోర్టులో రూ. 50వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. మరోసారి అరెస్ట్ చేస్తారంటూ వార్తలు వినిపించినే నేపథ్యంలో ఆయన బెయిల్ కోర్టులో లొంగిపోవడం, బెయిల్ రావడం జరిగిపోయాయి.












Click it and Unblock the Notifications