సప్తగిరి పత్రికతో పాటు అన్యమత పత్రిక వివాదం .. గుంటూరులో తిరుపతి పోలీసుల దర్యాప్తు
తిరుమల తిరుపతి దేవస్థానంలో తాజాగా మరోమారు సప్తగిరి మాసపత్రికతో పాటు అన్యమత మాసపత్రిక కూడా పాఠకుడికి వచ్చింది అన్న వార్తలతో మరో వివాదం చెలరేగింది. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి టీటీడీపై తప్పుడు ప్రచారం,వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా టీటీడీ మాస పత్రిక సప్తగిరి కూడా వివాదంలోకి వెళ్లడంతో ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తుకు దిగారు.
టీటీడీ అందిస్తున్న సప్తగిరి మాస పత్రికతో పాటుగా అన్యమతానికి చెందిన పత్రిక పంపిణి వ్యవహరంపై తిరుపతి పోలీసులు విచారణ చేపట్టారు. తిరుపతి పోలీసులు గుంటూరు చేరుకొని మల్లిఖార్జునపేటలోని చందాదారుడు విష్ణు నివాసంలో విచారణ చేశారు. ఈ నెల 6న టిటిడి పోస్టు ద్వారా సప్తగిరి పుస్తకంతో పాటు సువార్త పుస్తకం వచ్చిందన్న ప్రచారం జరిగింది. దీనిపై హిందూ సంఘాలు మండిపడ్డాయి. మరోమారు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి.

దీనిపై విచారణ చేపట్టామని పేర్కొన్న పోలీసులు సప్తగిరి పుస్తకంతో పాటు సువార్త సజీవ పుస్తకం ఉందని పోస్టు తీసుకున్న విష్ణు చెప్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పోస్టల్ లో ఉన్న అడ్రస్ గుంటూరులో ఇంటి అడ్రస్ ఒక్కటేనా లేదా అనే విషయాన్ని,పోస్టుమ్యాన్ ను కూడా విచారిస్తామని పోలీసులు చెబుతున్నారు. పూర్తి విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వారంటున్నారు.
ఈ విషయం మీద స్పందించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సప్తగిరి పత్రికతో పాటుగా అన్యమత ప్రచారానికి సంబంధించిన పుస్తకం పంపించారని చెప్పడం అవాస్తవమని, అలా జరిగే అవకాశమే లేదని పేర్కొన్న విషయం తెలిసిందే. అన్యమత ప్రచారం చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్న ఆయన దైవ సేవలో ఇంత హీనమైన పని ఎవరూ చేయరని దీని వెనుక వున్న కుట్ర త్వరలోనే బయటపెడతామని, విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. అందులో భాగంగా నేడు తిరుపతి పోలీసులు గుంటూరు వెళ్లి చందా దారుడు విష్ణును విచారించారు.












Click it and Unblock the Notifications