బాలకృష్ణ..భార్యతో సహా: జనంతో మమేకం.. క్యూ లైన్లో నిల్చుని ఓటు
అనంతపురం: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ.. జోరుగా సాగుతోంది. మొత్తం 12 మున్సిపాలిటీలు, 71 మున్సిపల్ కార్పొరేషన్లలో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 75 మున్సిపాలిటీల్లో పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా.. నాలుగు ఏకగ్రీవమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 40 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగనున్నందున.. ఓట్ల శాతం మరింత పెరుగుతుంది. 60 నుంచి 70 శాతం మేర పోలింగ్ నమోదవుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి.
ఈజ్ ఆఫ్ లివింగ్, మున్సిపల్ పెర్ఫార్మెన్స్: ఏపీలోని బెస్ట్ సిటీలు ఇవే: తెలంగాణలో జీరో
పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విజయవాడలో ఓటు వేశారు. ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన సొంత నియోజకవర్గం అనంతపురం జిల్లా హిందూపురం టౌన్లో ఆయన ఓటు వేశారు. కొద్దిరోజులుగా ఆయన హిందూపురంలోనే ఉంటున్నారు. పార్టీ తరఫున మున్సిపాలిటీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రతి వార్డులోనూ పర్యటించారు. ఇంటింటికీ తిరిగారు. టీడీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు.
ఈ ఉదయం ఆయన భార్య వసుంధరతో కలిసి స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్కు చేరుకున్నారు. ఆ సమయంలో ఓటర్లు బారులు తీరి నిల్చుని కనిపించారు. దీనితో ఆయన వారితో పాటు క్యూ లైన్లో నిల్చున్నారు. పోలింగ్ సిబ్బంది, స్థానిక పోలీసులు.. ఆయనకు ఓటు వేసే అవకాశం కల్పించినప్పటికీ.. ప్రజలతో పాటు తానూ క్యూ లైన్లోనే ఉంటానని సున్నితంగా తిరస్కరించారు. తన వంతు వచ్చేంత వరకూ భార్యతో కలిసి క్యూలైన్లో నిల్చున్నారు. అనంతరం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని విజ్ఙప్తి చేశారు. ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే రాజ్యాంగాన్ని, దేశాన్ని గౌరవించినట్టవుతుందని వ్యాఖ్యానించారు.