అనంతలో టిడిపికి ఎదురుదెబ్బ : వైసిపి లోకి సీనియర్ నేత : అక్కడ పట్టు ఎవరిది..!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ..టిడిపి కంచుకోట అనంతపురం జిల్లాలో ఎదురుదెబ్బ తగిలింది. జిల్లాలోని హిందూపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని వైసిపి లో చేరారు. 2014 ఎన్నికల్లో హిందూపూర్ నుండి బాలకృష్ణ ను రంగంలోకి దింపేం దుకు గనికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని టిడిపి హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు హామీని నెరవేర్చకుండా..ఎటువంటి పదవి ఇవ్వకుండా దూరం పెట్టింది. దీంతో..గని టిడిపిని వీడి వైసిపి లో చేరారు.
మూడు దశాబ్దాలుగా ఘని టిడిపి లో ఉన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేస్తు న్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో అబ్దుల్ గని పార్టీలో చేరారు. గత నాలుగున్నరేళ్ల పాలనలో మైనారిటీలకు చం ద్రబాబునాయుడు చేసేందేమీ లేదని ఈసందర్భంగా అబ్దుల్ గని పేర్కొన్నారు. టీడీపీలో 30 ఏళ్లుగా తాను సేవలు అందించినా.. ప్రాధాన్యత కల్పించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని గుర్తు చేశారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఎంతోమంది విద్యార్థులు లబ్ధిపొందారని పేర్కొన్నారు. గని పార్టీని వీడటం స్థానికం గా హిందూపూర్ లో టిడిపి కి మైనార్టీ ఓట్ బ్యాంక్ పై ప్రభావం చూపనుంది.
టీడీపీ సీనియర్ నేత అయిన అబ్దుల్ గని 2009 నుంచి 2014 వరకు హిందూపురం ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో సినీ నటుడు బాలకృష్ణ కోసం ఆయన హిందూపురం సీటును వదులుకున్నారు. అబ్దుల్ గని చేసిన ఈ త్యాగానికి ప్రతిఫలంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ, నాలుగున్నరేళ్లు అవుతున్నా ఆ హామీని నెరవేర్చలేదు. మరోవైపు ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ఆయనను పట్టించుకోకుండా ఉండటంతో గని పార్టీని వీడాలని డిసైడ్ అయ్యారు. అయితే, ఇదే జిల్లాలో పట్టు కోసం టిడిపి-వైసిపి తో పాటుగా జనసేన సైతం ప్రయత్నాలు చేస్తోంది. జనసేన ఇదే జిల్లా కేంద్రంలో కవాతు సైతం నిర్వహించింది. మూడు రోజుల పాటు పవన్ కళ్యాన్ జిల్లాలోనే పర్యటించారు. ఇక, జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఎవరు పట్టు సాధిస్తారనేది ఆసక్తి కరంగా మారింది.