చికిత్స కోసం యశోదకు.. పబ్లిషిటీ కోసం గాంధీ ఆస్పత్రికా.. కేసీఆర్పై షర్మిల నిప్పులు
సీఎం కేసీఆర్పై షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. ఆయన అసమర్థ, చేతగాని పాలన వల్లే ఇబ్బందులు వస్తున్నాయని విరుచుకుపడ్డారు. కరోనా కష్ట కాలంలో మహిళలు తమ కుటుంబ పోషణ కోసం ఇళ్లను, బంగారాన్ని, చివరకు, మంగళ సూత్రాన్ని కూడా తాకట్టు పెట్టి.. దీనస్థితిలో కాలం వెళ్ల దీస్తున్నారని వైఎస్.షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోని వాస్తవ పరిస్థితి అని, కానీ ప్రభుత్వానికి ఇవేమి కనిపించడం లేదన్నారు. ఇందిరాశోభన్ కో-ఆర్డినేషన్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి డ్వాక్రా సంఘాల మహిళలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.

చికిత్స కోసం యశోదకు.. పబ్లిసిటీ కోసం గాంధీకా
చికిత్స కోసం యశోద ఆసుపత్రి వెళ్లిన కేసీఆర్ పబ్లిసిటీ కోసం గాంధీ ఆసుపత్రికి వెళ్లారని ఆమె ఎద్దేవా చేశారు. ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ప్రతి రోజు మేము విన్నవిస్తున్నా.. దున్నపోతు మీద వాన పడ్డ చందంగా దాన్ని ఈ సర్కార్ అసలు పట్టించుకోవడం లేదని వైఎస్.షర్మిల మండిపడ్డారు. తమ ఒత్తిడి తట్టుకోలేక కరోనాను ఆరోగ్యశ్రీలో కాకుండా ఆయుష్మాన్ భారత్ లో చేర్చి చేతులు దులుపుకున్నారన్నారు. ఆయుష్మాన్ భారత్ వల్ల తెలంగాణలోని 26 లక్షల కుటుంబాలకే లబ్ధి చేకూరుతుందని, అదే ఆరోగ్యశ్రీ వల్ల 80 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతాయన్నారు. కేసీఆర్ దొర, దయచేసి కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరుతున్నామన్నారు. ఒకప్పుడు ఆయుష్మాన్ భారత్ ఒట్టి దిక్కుమాలిన పథకం అన్న కేసీఆర్.. ఇప్పుడే అదే స్కీమ్ లో ఎందుకు అమలు చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు.

కేజీ టు పీజీ విద్య హామీ ఏదీ..?
వైఎస్సార్ పాలనలో మాదిరిగా ఇప్పుడున్న కేసీఆర్ పాలనలో విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ లేదని, కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అని మాట ఇచ్చి ఆ మాటను సీఎం కేసీఆర్ తప్పడం వల్లే, పిల్లల చదువుల కోసం మహిళలు అప్పులు చేస్తూనే ఉన్నారన్నారు. ఇప్పుడు వైద్యానికి తోడు, బతికేందుకు కూడా అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు అప్పులు చేస్తే గానీ ఇళ్లు గడవలేని పరిస్థితి నేడు తెలంగాణలో ఉందన్నారు. ఇదేనా సంక్షేమం, ఇదేనా మహిళా సాధికారతా.. సీఎం ఆలోచన చేయాలన్నారు. మహిళలంటే సీఎం కేసీఆర్ కు ఎప్పుడూ చులకనేనని అందుకే వారికి పదవులు ఇవ్వరన్నారు. ఒకవేళ వాళ్లు తిరగబడితే తెలంగాణ తల్లి సాక్షిగా వారిపై దాడులు చేసి అవమానిస్తారని వాపోయారు. ముఖ్యమంత్రి అసమర్థత వల్ల, చేతగాని తనం వల్ల 10 లక్షలకు పైగా మహిళలు అప్పుల పాలయ్యారని, డ్వాక్రా మహిళా సంఘాల రుణాలన్నింటినీ మాఫీ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.

మహిళా సంఘాలకు మొండిచేయి
గత మూడేళ్లుగా మహిళా సంఘాల రుణాల వడ్డీలకు ఎగనామం పెడుతున్నారు. ఆ వడ్డీ భారం కూడా అక్కచెల్లెమ్మల మీదే పడుతుంది. ఆ వడ్డీ, రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నా. ఇది కేసీఆర్ గారి ప్రభుత్వ కనీస బాధ్యత. వైఎస్సార్ హయాంలో ప్రవేశ పెట్టిన అభయహస్తం కో కాంట్రీబ్యూటరీ పథకాన్ని రద్దు చేయడం వల్ల తాము ఎన్నో కష్టాలు పడుతున్నామని, తమ తరపున మీరు ముందుండి పోరాడాలని వైఎస్.షర్మిలను మహిళలు కోరారు. తెలంగాణలో మహిళలు పడుతున్న బాధలు, ముఖ్యంగా ఒంటరి మహిళలుగా పడుతున్న ఇబ్బందులన్నీ తనకు తెలుసునన్నారు వైఎస్. షర్మిల. అభయహస్తం పథకం కింద మీరు చెల్లించిన డబ్బులు కూడా మీరు పొందలేక ఎన్ని అవస్థలు పడుతున్నారో తనకు తెలుసన్నారు. మీరు ఓపికతో ఉండాలని, ధైర్యంగా పోరాటం చేస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు.
Recommended Video

ఓటుతో బుద్ది చెప్పాల్సిందే..
రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని వైఎస్.షర్మిల పిలుపునిచ్చారు. మనందరికి మంచిరోజులు వస్తాయి, వైఎస్సార్ గారి ప్రభుత్వం మళ్లీ వస్తుందని, అధికారంలోకి రాగానే అభయహస్తం పథకాన్ని పునరుద్ధరిస్తానని మాట ఇస్తున్నానని వైఎస్.షర్మిల మహిళలకు భరోసా ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ లో అనిల ( హయత్ నగర్), సుజన ( ములుగు), మంజుల ( సిద్ధిపేట), భాగ్యలక్ష్మీ ( నర్సాపూర్), రాజేశ్వరీ ( హైదరాబాద్), సునీతా ( సంగారెడ్డి), రాణి (మేడ్చల్), చంద్రకళ ( మెదక్), సరితా ( నారాయణపేట), వనజ ( మేడ్చల్) తదితర మహిళ నేతలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications