తెలంగాణలో 339 కరోనా కేసులు: ఇద్దరు మృతి
కరోనా కేసులు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా తగ్గుతున్నాయి. ఏపీలో హెచ్చు తగ్గులు ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణలో కరోనా మహమ్మారి గతంలో కంటే ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. ఒకప్పుడు వేలాదిగా నమోదయ్యే కేసులు ప్రస్తుతం 400లోపు నమోదు అవుతున్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 339 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇద్దరు మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 6,56,794 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం 3,867 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
తాజాగా రాష్ట్రంలో కరోనా నుంచి 417 మంది కోలుకోగా, ఇప్పటి వరకు 6,46,761 మంది కోలుకున్నారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ ప్రకారం.. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతం ఉండగా, దేశంలో 1.3 శాతం ఉంది. రాష్ట్రంలో కోలుకున్నవారి రేటు 98.47 శాతం ఉండగా, దేశంలో 97.54 శాతం ఉంది. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 6,166 ఉంది.

ఇక జిల్లాల వారీగా కరోనా కేసులను చూస్తే..ఆదిలాబాద్ జిల్లాలో 3, భద్రాది కొత్తగూడెం -5, జీహెచ్ఎంసీ -91, జగిత్యాల-14, జనగామ-4, జయశంకర్ భూపాలపల్లి- -1, జోగులాంబ గద్వాల -2, కామారెడ్డి-2, కరీంనగర్-31, ఖమ్మం- 28, మహబూబ్నగర్-3, మహబూబాబాద్-4, మంచిర్యాల-9, మేడ్చల్ మల్కాజ్గిరి-21, ములుగు -5, నల్గొండ-15, నారాయణపేట (ఎలాంటి కేసులు లేవు), నిర్మల్ -1, నిజామాబాద్-4, పెద్దపల్లి-16, రాజన్న సిరిసిల్ల-5, రంగారెడ్డి-19, సంగారెడ్డి-3, సిద్దిపేట-10, సూర్యాపేట-9, వికారాబాద్-1, వనపర్తి-3, వరంగల్ రూరల్ -6, వరంగల్ అర్బన్-18, యాదాద్రి భువనగిరి-5 చొప్పున పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కొమరం భీం ఆసిఫాబాద్, మెదక్ జిల్లాలో ఎలాంటి కరోనా కేసులు రాలేదని పేర్కొన్నది.
ప్రస్తుతం పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడమే కాకుండా రికవరీ కేసులు కూడా బాగానే నమోదవుతున్నాయి. రోజురోజకు కోలుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడికి అనేక చర్యలు చేపట్టింది. లాక్డౌన్, వ్యాక్సినేషన్, తదితర ఆంక్షలు చేపట్టడం వల్ల ప్రస్తుతం కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టే దశకు చేరుకుంది.
ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే ప్రకటించలేదు.
ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications