తెలంగాణలో నిన్నటికన్నా స్వల్పంగా పెరిగిన కేసులు..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నిన్నటి కంటే స్వల్పంగా కేసుల పెరుగుదల ఉంది. గత 24 గంటల్లో 30 వేల 212 మందికి కరోనా పరీక్షలు చేశారు. వీరిలో 450 మందికి పాజిటివ్ వచ్చింది. కరోనా కేసులు హైదరాబాద్లో ఎక్కువగా వస్తున్నాయి. సిటీలో అత్యధికంగా 220 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 30 కేసులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 25 కేసులు వచ్చాయి.
ఒక్కరోజు వ్యవధిలో మరో 476 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్య అధికంగా ఉండటం ఊరటనిచ్చే అంశం. కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8 లక్షల 31 వేల 265 కొవిడ్ పాజిటివ్ కేసులు వచ్చాయి. 8 లక్షల 24 వేల 360 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2 వేల 794కి తగ్గింది.
రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4 వేల 111గా ఉంది. క్రితం రోజు రాష్ట్రంలో 29వేల 590 మందికి కరోనా పరీక్షలు చేయగా, 435 మందికి పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.
కరోనా వైరస్, మంకీ వైరస్.. కాగా ఇప్పుడు కొత్త వైరస్ కలవర పెడుతుంది. మార్బర్గ్ అనే వైరస్ ఆఫ్రికా ఘనా దేశంలో వెలుగుచూసింది. ఆ వైరస్ సోకి ఇప్పటికే ఇద్దరు చనిపోయారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్నీ దేశాలను అలర్ట్ చేసింది. ఇప్పుడు అంతా సజావుగా ఉంది అనుకునే లోపు కొత్త వైరస్.. వేరియంట్లు వస్తున్నాయి. జనాలను ఎప్పుడూ ఏదో ఒక భయం పెడుతూనే ఉన్నాయి. ఇప్పుడు కరోనా కేసులు కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సీరియస్ నెస్ ఎక్కువగా లేకున్నా.. టెన్షన్ మాత్రం తప్పడం లేదు. ఈ సారి వర్షకాలంలో.. సీజనల్ వ్యాధులతోపాటు కేసులు కూడా టెన్షన్ పెట్టిస్తున్నాయి.