మూడు రైళ్ల దగ్ధం - ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు : ఆందోళనలో ప్రయాణీకులు..!!
సికింద్రాబాద్ లో పరిస్థితి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. పోలీసులు భారీగా మోహరించారు. ఇంకా రైలు పట్టాల పైన కొందరు ఆందోళన కారులు బైఠాయించారు. స్టేషన్ లో భారీ విధ్వసం జరిగింది. మొత్తం మూడు రైళ్లకు నిరసన కారులు నిప్పు పెట్టటంతో ఆ మూడు రైళ్లు దగ్గం అయ్యాయి. అందులో ఒక ఎంఎంటీఎస్ రైలు సైతం ఉంది. ఆందోళన హింసాత్మకంగా మారటం ..స్టేషన్ లో విధ్వంసం జరగటంతో నియంత్రించటానికి పోలీసులు కాల్పులు సైతం జరిపారు. ఇక, సికింద్రాబాద్ పరిధిలో 71 రైళ్లు రద్దయ్యాయి. నగర శివారు స్టేషన్లలో పలు రైళ్లు నిలిచిపోయాయి.
రైళ్ల రాకపోకలపై ప్రభావం
వరంగల్ స్టేషన్ లో అనేక ఎక్స్ ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ కు వచ్చే రైళ్లు నిలిచిపోయాయి. దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు సమీక్షించారు. రైళ్ల రాకపోకలకు ఎంత సమయం పడుతుందనే అంశం పైన పోలీసులతో సమావేశం నిర్వహించారు. పోలీసు స్టేషన్ లో రైల్వే ఆస్తుల విధ్వంసం ఆపేందుకు ఆర్పీఎఫ్ సిబ్బంది కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. అందులో ఒక యువకుడు మరణించాడు. ఇక, సికింద్రాబాద్ స్టేషన్ కు వచ్చే సిటీ బస్సులను సైతం స్టేషన్ పరిసర ప్రాంతాల్లోనే నిలిపివేసారు.
ప్రయాణీకుల ఆందోళన..
ముందుగా రిజర్వ్ చేసుకున్న ప్రయాణీకులు.. సికింద్రాబాద్ చేరుకోవాల్సిన వారు ఇబ్బందులు పడుతున్నారు. సికింద్రాబాద్ కు వచ్చే రైళ్లను దారి మళ్లించారు. అదే విధంగా సికింద్రాబాద్ నుంచి వెళ్లాల్సిన రైళ్లను ఇతర స్టేషన్ల నుంచి కొనసాగించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లను సమీపంలోని స్టేషన్లకు మళ్లించే అవకాశాల పైన చర్చలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో నగర పరిధిలో ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేయటంతో ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం స్టేషన్ నుంచి బయల్దేరాల్సిన రైళ్లను సైతం అధికారులు నిలిపివేయటంతో స్టేషన్ కు వచ్చిన వారంతా ఆందోళనకు గురయ్యారు.
సాధారణ ప్రయాణీకులకు గాయాలు
నిరసనకారులు రాళ్లతో రైళ్లపైన దాడులు చేయటంతో లోపల ఉన్న ప్రయాణీకులు గాయాలపాలయ్యారు. వారికి రైల్వే ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పలువురు స్టేషన్ నుంచి బయటకు ప్రాణాలు అరచేతిలో పట్టుకొన పరుగులు తీసారు. ఒక్క సారిగా ఆందోళన హింసాత్మకంగా మారటంతో .. ఫైరింగ్ చేయాల్సి వచ్చిందని అధికారులు ప్రాధమిక సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. పెద్ద సంఖ్యలో వచ్చిన నిరసనకారులను స్టేషన్ నుంచి ఖాళీ చేయించటం... రైళ్ల రాకపోకలను పునరుద్దరించటం పైనే అధికారులు ఇప్పుడు ఫోకస్ పెట్టారు. అయితే, ఉన్నతాధికారుల ఆదేశాలు..వారి నుంచి సూచనలకు అనుగుణంగా స్టేషన్ లో మకాం వేసిన అధికారులు వ్యవహరిస్తున్నారు.