ఎల్బీనగర్లో దారుణం: బాలికను బెదిరించి ఆటో డ్రైవర్ రేప్, బాధితురాలికి ఈటల పరామర్శ
హైదరాబాద్: నగరంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన మరువకముందే నగరంలో వరుసగా దారుణాలు జరగడం కలకలం రేపుతున్నాయి. తాజాగా, ఎల్బీనగర్లో తొమ్మిదేళ్ల బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను బెదిరింపులకు గురిచేసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎల్బీనగర్ పోలీసులు.. ఆటో డ్రైవర్పై కేసు నమోదు చేశారు. నిందితుడైన పాతబస్తీకి చెందిన ఆటో డ్రైవర్ సలీంను అరెస్ట్ చేశారు. వరుస ఘటనలతో మహిళలకు, యువతులకు, బాలికలకు కూడా రక్షణ లేకుండా పోతోందని మహిళా సంఘాలు, ప్రతిపక్షాల నేతలు మండిపడుతున్నారు. పిల్లలను పాఠశాలకు పంపాలన్నా భయం వేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. మహిళలపై దారుణాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.
కాగా, అత్యాచారానికి గురైన బాధితురాలిని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరామర్శించారు. రాష్ట్రంలో సీసీ కెమెరాలు, షీ టీమ్స్ ఉన్నా.. మహిళలపై అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలకు రక్షణ కల్పించలేదని సీఎం కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మరోవైపు, జూబ్లీహిల్స్ మైనర్ అత్యాచారం కేసులో మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నిందితుల్లో ఐదుగురు మైనర్లే. ముగ్గురు మైనర్లను విచారించేందుకు కోర్టు అనుమతిచ్చిన క్రమంలో పోలీసులు నిందితులను వేర్వేరుగా విచారిస్తున్నారు.