Hyderabad: అంబర్పేట్లో దారుణం.. బాలుడిపై దాడి చేసి చంపేసిన కుక్కలు..
హైదరాబాద్ అంబర్పేట్లో బాలుడిపై కుక్కలు దాడి చేసి చంపేశాయి.
హైదరాబాద్ అంబర్పేట్ లో దారుణం జరిగింది. బాలుడిపై కుక్కలు దాడి చేసి చంపేశాయి. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయికి చెందిన గంగాధర్ ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వచ్చారు. నాలుగేళ్లుగా అంబర్ పేట ఛే నెంబర్ చౌరస్తాలో ఉన్న ఓ కారు సర్వీస్ సెంటర్ లో వాచ్ మెన్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

బాగ్ అంబర్ పేట
ఆయనకు భార్య జనప్రియ, ఆరేళ్ల కూతురు, నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. వారు బాగ్ అంబర్ పేటలోని ఎరుకల బస్తీ ఉంటున్నారు. ఆదివారం పిల్లలకు సెలవు కావడంతో కుమార్తె, కొడుకు ప్రదీప్ ను తాను పని చేస్తున్న సర్వీస్ సెంటర్ కు తీసుకొచ్చాడు. బిడ్డను పార్కింగ్ వద్ద ఉన్న క్యాబిన్ లో ఉంచి.. కుమారుడిని లోపలికి తీసుకెళ్లాడు గంగాధర్.

ప్రదీప్ పై దాడి
ఏదో పనిపై గంగాధర్ మరో వాచ్ మెన్ తో కలిసి బయటకు వెళ్లాడు. ప్రదీప్ కు ఇక్కడే ఉండు అని చెప్పి వెళ్లాడు. ప్రదీప్ అక్కడే ఉండక.. పార్కింగ్ వద్ద ఉన్న అక్క వద్దకు బయల్దేరాడు. ఈ క్రమంలో బాలుడు నడిచి వస్తుండగా.. కుక్కలు మీదికి వచ్చాయి. ప్రదీప్ తప్పించుకునే ప్రయత్నం చేయగా.. కుక్కలు వదిలిపెట్టలేదు. ప్రదీప్ పై దాడి చేశాయి. అయితే ప్రదీప్ అరవడంతో చుట్టు పక్కల వారు వచ్చి కుక్కలను వెళ్లగొట్టారు.
సీసీ కెమెరా
వెంటనే అక్కడికి చేరుకున్న గంగాధర్ కుమారుడిని ఆస్పత్రికి తరలించాడు. కానీ ప్రదీప్ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కుక్కలు తీవ్రంగా గాయపరచడంతో ప్రదీప్ ప్రాణాలు విడిచాడు. బాలుడిపై కుక్కలు దాడి చేసే ఘటన దృశ్యాలు అక్కడే సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. కొడకు మృతితో గంగాధర్ కన్నీరుమున్నరయ్యారు. అనవసరంగా పిల్లలను ఇక్కడి తీసుకొచ్చానని బోరున విలపించారు.
చర్యలేవి!
నగరంలో వీధి కుక్కలు భారీగా పెరిగాయి. ఏ వీధికి వెళ్లినా కుక్కలు మందలు కనిపిస్తున్నాయని నగరవాసులు చెబుతున్నారు. హైదరాబాద్ లో కుక్కకాటు బాధితుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి కుక్కలను అదుపు చేయాలని నగరవాసులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications