దారుణం: అత్యాచారం చేయిస్తానంటూ కన్నకూతురుకు తండ్రి బెదిరింపులు
హైదరాబాద్: కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నతండ్రే కూతురు పట్ల కర్కశంగా వ్యవహరించాడు. ఇంటి నుంచి వెళ్లిపోవాలని, లేదంటే అత్యాచారం చేయిస్తానంటూ కన్న కూతుర్ను బెదిరింపులకు గురిచేశాడు. దీంతో ఆ వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
పోలీసులు తెలిపిన ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఓ ఎంఫిల్ విద్యార్థిని తన తల్లి, తండ్రి, సోదరితో కలిసి నివాసం ఉంటోంది. అయితే, సదరు విద్యార్థిని ఇంట్లో నుంచి వెళ్లాలంటూ కొంత కాలంగా ఆమెతోపాటు తల్లిని తండ్రి బెదిరిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం ఇంట్లోకి వచ్చిన తండ్రి భార్య, కుమార్తెలపై దాడికి పాల్పడ్డాడు.

తన తల్లి పేరిట ఉన్న ఆస్తికి సంబంధించి అద్దెలు వసూలు చేసుకోవడంతోపాటు తమపై దాడికి దిగుతున్నాడని, దీనిపై ప్రశ్నిస్తే.. అత్యాచారం చేయిస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధిత కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
రోజుల వ్యవధిలో ప్రియురాలు, ప్రియుడు ఆత్మహత్య
ఇది ఇలావుండగా, ఖమ్మం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తన ప్రియురాలి బలవన్మరణానికి తానే కారణమని భావించిన 19ఏళ్ల యువకుడు తన పెదనాన్న ఇంట్లో ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇద్దరు యువతీయువకుల మరణాలతో రెండు కుటుంబాల్లోనూ విషాదం అలుముకుంది.
బాధితుల బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత యువకుడు అతడి గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక ప్రేమించుకున్నారు. అయితే, పెళ్లికి బాలిక తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో నెల రోజుల క్రితం యువకుడు తాను పురుగుల మందు తాగుతున్నానంటూ సెల్ఫోన్లో వీడియో తీసి ప్రియురాలికి పంపాడు. అది చూసిన యువతి ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. బాలిక మృతిపై ఫిర్యాదు లేకపోవడంతో కేసు నమోదు కాలేదు.
ఈ ఘటన జరిగిన తర్వాత రోజే యువకుడ్ని తల్లిదండ్రులు పక్క మండలంలో ఉన్న పెదనాన్న ఇంటికి పంపారు. కాగా, కొద్ది రోజుల తర్వాత యువకుడు బాలికకు పంపిన వీడియో వెలుగుచూసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పంచాయతీ పెట్టారు. రూ. 13 లక్షలు జరిమానా కట్టాలని పెద్ద మనుషులు తేల్చారు. యువకుడి తండ్రి రూ. లక్ష చెల్లించి మిగితా మొత్తానికి నోటు రాసిచ్చారు. మూడు రోజుల క్రితం యువకుడు సొంతింటికి వెళ్లగా పంచాయతీ గురించి తెలిసింది. ఆదివారం తిరిగి పెదనాన్న ఇంటికి వచ్చి మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
యువతిని ఇంటికి పిలిచి ప్రియుడి తల్లి దాడి
ఓ యువతిపై ఆమె ప్రియుడి తల్లి దాడి చేసింది. ఈ దాడిలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. భరత్, శివాని గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. కొద్దీ రోజుల క్రితం భరత్ కు వేరే యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఆ పెళ్లి ఇష్టం లేని భరత్ రెండు రోజుల క్రితం శివానిని తీసుకోని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. దీంతో భరత్ తల్లిదండ్రులు ఫోన్ చేసి ఇద్దరికి పెళ్లి చేస్తామని ఇంటికి పిలిపించారు.
తల్లిదండ్రుల మాటలు నమ్మిన భరత్, శివానిని తీసుకోని ఇంటికి వచ్చాడు. శనివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో భరత్ తల్లి అరుణ శివానిపై రాడ్డుతో దాడి చేసింది. ఈ సమయంలోనే శివాని గట్టిగా కేకలు వేయడంతో ఆమెను రక్షించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. రాడ్డుతో కొట్టడంతో శివాని తలకు బలమైన గాయమైంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications