బెదిరించి.. మల్లారెడ్డి కాలేజీలో విద్యార్థినిపై ల్యాబ్ ఇంఛార్జ్ అఘాయిత్యం
హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం ఘటనలో నిందితులను ఎన్కౌంటర్ చేసినప్పటికీ మహిళలు, యువతులపై దారుణాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా నగరంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థినిపై ఆ కళాశాల సిబ్బందే దారుణానికి ఒడిగట్టారు.
హైదరాబాద్ నగరంలోని పేట్ బషీరాబాద్కు చెందిన ఓ యువతి మేడ్చల్లోని మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతోంది. తనపై కాలేజీ ల్యాబ్ ఇంఛార్జీ వెంకటయ్య అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు మంగళవారం పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కాలేజీలో ల్యాబ్లోనే నిందితుడు తనను బెదిరింపులకు గురిచేసి అత్యాచారానికి పాల్పడినట్లు తన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇది ఇలావుండగా, వరంగల్ జిల్లాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. 13ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన వంశీ(22) అనే యువకుడు కూలీ పనిచేసుకుంటూ గుండ్ల సింగారంలో ఉంటున్నాడు.
కొద్ది రోజుల క్రితం హన్మకొండకు చెందిన 13ఏళ్ల బాలికతో అతడికి పరిచయం ఏర్పడింది. డిసెంబర్ 19న పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించి తన వెంట తీసుకెళ్లాడు. హన్మకొండ నుంచి కొప్పుల గ్రామానికి బస్సులో తీసుకెళ్లి అక్కడే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత డిసెంబర్ 20న రాత్రి బాలికను ఆమె ఇంటి సమీపంలో వదిలి వెళ్లాడు. ఇంటికి చేరిన బాలికను తల్లిదండ్రులు మందలించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు వంశీని అరెస్ట్ చేశారు.