Khairathabad Ganesh: బడా గణేషుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు..!
హైదరాబాద్ లో వినాయక చవితి అంటే మొదటగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ బడా గణనాథుడే. ఈ గణేషుడిని చూడడానికి తెలంగాణ నుంచే కాకుండా ఏపీ నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తారు. ఖైరతాబాద్ గణేషుడిని చూడడానికి శనివారం భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. వీకెండ్ కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలొచ్చారు. ఖైరతాబాద్ బడా గణనాథుడిని ఇప్పటి వరకు 4 లక్షలకు పైగా మంది భక్తులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం నుంచి ఖైరతాబాద్ లో రద్ధీ కనిపించింది.
తెల్లవారుజాము 5 గంటల నుంచే భక్తులు కూలైన్లలో బారులు తీరారు. దీంతో ఖైరతాబాద్ పరిసరాలన్నీ భక్తులతో నిండిపోయాయి. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి క్యూలైన్లు కొనసాగాయి. ఆర్టీసీ బస్సులతో పాటు, మెట్రో రైళ్లలో కూడా భక్తులు భారీగా తరలొచ్చారు. ఎక్కువ శాతం భక్తులు మెట్రో రైళ్లలో వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు రావడంతో శనివారం సాయంత్రం ఖైరతాబాద్ చౌరస్తా నుంచి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

బడా గణేషుడి నుంచి ఐమ్యాక్స్ వరకు రద్దీ కొనసాగింది. ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట, ట్యాంక్ బండ్, లక్డీకాపూల్, చింతల్ గూడ బస్తీ పరిసరాలు భక్తులు, వాహనాల పార్కింగ్ తో నిండిపోయాయి. దీంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. నేటి గణేషుడి దర్శనం పూర్తి కానుంది. ఆదివారం అర్థరాత్రి వరకు గణనాథుడి దర్శనానికి అనుమతి ఇస్తారు. ఆదివారం బడా గణేశ్ మండపం వద్ద భక్తులకు రుద్రాక్షలు పంపిణీ చేస్తారు. సోమవారం నుంచి దర్శనం నిలిపివేస్తారు.
సోమవారం విగ్రహం వద్ద వెల్డింగ్ పనులు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. అందుకే దర్శనం ఆదివారం అర్థరాత్రి వరకే ఉంటుందని పేర్కొన్నారు. ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్రకు అధికారులు, పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగుకుండా చూస్తున్నారు. సెప్టెంబర్ 17న ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం మధ్యాహ్నం 1.30 లూపే జరిగేలా చూస్తామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఉదయం 6 గంటలకే పూజలు అన్ని పూర్తి చేసుకొని శోభాయాత్ర ప్రారంభం అయ్యేలా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications