కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారంటే...మొన్న ఉత్తేజ్,నేడు బ్రహ్మానందం.. అందరిదీ అదే మాట...
కరోనా లాక్ డౌన్ పీరియడ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు ప్రెస్మీట్ పెట్టినా జనం టీవీలకు అతుక్కుపోతున్నారు. సాధారణంగానే ఆయన ప్రసంగాలు,పంచ్లు,వాక్పటిమ అంటే అందరిలోనూ ప్రత్యేక ఆసక్తి. లాక్ డౌన్ పీరియడ్లో అది మరింతగా రెట్టింపైంది. కేసీఆర్ మాట్లాడుతున్నారంటే.. ఏదో భరోసా ఇస్తారని జనం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల సినీ నటుడు ఉత్తేజ్ ఏకంగా.. 'మిమ్మల్ని నాయినా అని పిలవాలని ఉందే' అంటూ కేసీఆర్పై ప్రశంసలు కురిపించారు. తాజాగా హాస్య నటుడు బ్రహ్మానందం సైతం కేసీఆర్పై ప్రశంసలు కురిపించారు.

కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారంటే..
'ఆయన ప్రెస్ మీట్ పెట్టారంటే.. ఒక భరోసా.. ఏదో మంచి మాట చెబుతారు. మనందరినీ కరోనా వ్యాధి నుంచి ఒడ్డున పడేస్తాడు. పామరుడి దగ్గరి నుంచి పండితుడి వరకూ ప్రతీ ఒక్కరికీ ఆ భరోసా కల్పించారు. నిజంగా ఆయన చాలా గొప్పవారు. ఆ గొప్పతనాన్ని అందరూ అంగీకరించాల్సిందే..' అని బ్రహ్మానందం కేసీఆర్ను కొనియాడారు. అదే సమయంలో ఆయన బాగోగులను చూస్తూ.. ఆయన్ను కంటికి రెప్పలా కాపడుతున్న ఆయన సతీమణికి హృదయపూర్వక నమస్కారాలు చెబుతున్నానని అన్నారు.

సహనం,ఓర్పు అవసరమన్న బ్రహ్మానందం..
మంత్రులు కేటీఆర్,హరీష్ రావు,ఈటెల రాజేందర్.. ఏదో మాటలు చెప్పడం కాకుండా.. మన ప్రాణాలు కాపాడటం కోసం పనిచేస్తున్నారని అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎవరూ ఆకలితో పడుకోవద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఇది ప్రపంచానికే ఆదర్శమని కొనియాడారు. ఇలాంటి విపత్కర సమయంలో అందరికీ ఓర్పు అవసరమన్నారు. గాంధీ ఓర్పుతో ఉన్నారు కాబట్టే స్వాతంత్య్రం వచ్చిందన్నారు. నెల్సన్ మండేలా ఓర్పుతో పోరాడారు కాబట్టే దక్షిణాఫ్రికాకు స్వేచ్చ లభించిందన్నారు. అంబేడ్కర్ గంగానదిని ఈదుకుంటూ వెళ్లి చదువుకున్నారు కాబట్టే ఆ స్థితిలో ఉన్నారని చెప్పారు. వీళ్లంతా తమ జీవితంలో ఎదురైన సమస్యలను ధైర్యంగా అధిగమించి నిలదొక్కుకున్నారని స్పష్టం చేశారు.

ఆకలి విలువేంటో నాకు తెలుసు..
ఒక పూట భోజనం చేయకపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆకలి విలువేంటో తెలుసు. మా నాన్న భోజనం పెట్టేంతవరకు ఆరుగురు అన్నదమ్ములం ఎదురుచూడటమంటే ఏంటో నాకు తెలుసు. తిండి లేక మంచినీళ్లు తాగి పడుకున్న రోజులు తెలుసు. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం నుంచి వచ్చి.. ఎన్నో పరిస్థితులను అధిగమించి.. ఎం.ఎ వరకు చదువుకుని,లెక్చరర్గా పనిచేసి... ఈరోజు ఈ స్థితికి వచ్చాను. కాబట్టి సహనంగా,ఓర్పుగా ఉండాలని చెప్పే అర్హత తనకుంది కాబట్టే చెబుతున్నానని అన్నారు. యావత్ ప్రపంచం కరోనా గురించి బాధపడుతున్నవేళ ప్రజలంతా బాధ్యతాయుతంగా మెలగాలని సూచించారు.












Click it and Unblock the Notifications