4వ తేదీ తర్వాతే వరదసాయం.. కోడ్ ఆఫ్ కండక్టేనని హైకోర్టు స్పష్టీకరణ
హైదరాబాద్లో వరదసాయం గ్రేటర్ ఎన్నిల తర్వాత కంటిన్యూ చేయాలని హైకోర్టు స్పష్టంచేసింది. వరదసాయం కొనసాగించాలనే పిటిషన్పై మంగళవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. పిటిషనర్ శరత్ కోర్టులో తన వాదనలు వినిపించగా.. ప్రభుత్వం కూడా వాస్తవ పరిస్థితిని వివరించింది. ఇరువురి వాదనలు విన్న తర్వాత.. ఎన్నికల ప్రక్రియ ముగిసినా తర్వాత వరదసాయం కంటిన్యూ చేయాలని ధర్మాసనం వెల్లడించింది.
కోడ్ ఆఫ్ కండక్ట్ కాదు..?
వరద బాధితులకు ఇచ్చే రూ. 10 వేల సాయం ఆపడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ శరత్ కోర్టుకు తెలిపారు. వరద బాధితులకిచ్చే సహాయం మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ క్రిందకు రాదని ఎన్నికల కమిషన్ చెప్పిందని తెలిపారు. 24 గంటల్లోనే మాట మార్చిందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే వరద బాధితుల సాయం పథకం అమలులోకి వచ్చిందని తెలిపారు. ఎన్నికలు ఉన్నాయని ముందుగానే తెలుసా అని ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే బాధితుల అకౌంట్లో డబ్బులు ఎందుకు వేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
పార్టీ వాళ్లకు ఇవ్వడంతో...
ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర బాడీనా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం క్రింద పనిచేయాలా అని హైకోర్టు ప్రశ్నించింది. బాధితులకు సహాయం ఆపకూడదని ఈసీ కోడ్ అఫ్ కండక్ట్లో ఉందా అని ఎలక్షన్ కమిషన్ని అడిగింది. కేంద్ర ఎన్నికల మోడల్ కోడ్ అఫ్ కండక్టే జీహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. వరద బాధితుల కోసం విడుదల చేసిన ఫండ్ని కొందరు పార్టీ వాళ్ళకే ఇస్తున్నారని.. అందుకే ఆ పథకాన్ని ప్రస్తుతం ఆపాలని నిర్ణయించామని ఎలక్షన్ కమిషన్ కోర్టుకు వివరించింది.
Recommended Video
4వ తేదీ తర్వాతే..
ఎన్నికలకు ముందు సాయం చేయడం వల్ల ఓటర్ల మీద తీవ్ర ప్రభావం పడుతుందని ఎన్నికల కమిషన్ తెలిపింది. గత నెల 20వ తేదీన ప్రారంభమైన పథకం పది రోజులు ఆపితే ఎలాంటి నష్టం లేదని ఎన్నికల కమిషన్ పేర్కొన్నది. వరద బాధితుల సహాయ పథకం కేవలం జీహెచ్ఎంసీ వరకే పరిమితమా లేక మొత్తం రాష్టానికి వర్తిస్తుందా అని ఏజీని ప్రశ్నించింది. వచ్చే నెల 4 న కౌంటర్ ధాఖలు చేసి పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. 4వ తేదీ తర్వాత డబ్బుల పంపింణీ చేయొచ్చని తెలుపుతూ తదుపరి విచారణను వాయిదా వేసింది.