రైళ్లకు నిప్పు - రైళ్లు రద్దు : కొనసాగుతున్న నిరసనలు -సికింద్రాబాద్ లో రణరంగం..!!
అగ్నిపథ్ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రణరంగంగా మారింది. స్టేషన్ లో నిలిచి ఉన్న రైళ్ల బోగీలకు నిరసనకారులు నిప్పు పెట్టారు. పెద్ద సంఖ్యలో నిరసన కారులు స్టేషన్ లోకి తీసుకొచ్చారు. రాళ్లతో రైళ్ల అద్దాలను ధ్వసం చేసారు. ఆర్మీ అభ్యర్ధులు కేంద్రం నిర్ణయం కారణంగా.. జీవితాలు నష్టపోతున్నామంటూ కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఆ నిర్ణయం వెంటనే రద్దు చేసి ఆర్మీ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. తాము దేనికైనా సిద్దమేనని..వెనక్కు తగ్గమని స్పష్టం చేస్తున్నారు.
రైళ్లకు నిప్పు.. విధ్వసం
రైళ్లకు నిప్పు పెట్టటంతో పాటుగా లగేజీ రాక్ లు..అదే విధంగా.. అక్కడ ఉన్న క్యాంటీన్లు.. స్టాళ్లను పూర్తిగా ధ్వంసం చేసారు. రైళ్ల పైకి రాళ్లు విసరడటంతో పలువురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. ఈ సమయంలో వివిధ ప్రాంతాల నుంచి రావాల్సిన.. వెళ్లాల్సిన పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఎక్కడికి అక్కడే నిలిపివేసారు. పలు రైళ్లను రద్దు చేసారు. పెద్ద సంఖ్యలో నిరసన కారులు రైళ్ల ముందు నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతో..పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ప్రయాణీకులు భయంతో స్టేషన్ నుంచి బయటకు వెళ్లారు. స్టేషన్ బయట బస్సులను ధ్వంసం చేసారు. మంటలను అదుపు చేయటానికి పెద్ద సంఖ్యలో ఫైర్ సిబ్బంది స్టేషన్ కు చేరుకున్నారు.
పోలీసుల పైనా రాళ్ల దాడి
తగలబడుతున్న రైళ్లల్లో మంటలు నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. స్టేషన్ వద్దకు చేరుకున్న పోలీసుల పైనా నిరసన కారులు రాళ్ల దాడి చేస్తున్నారు. వందల మంది విధ్వంసానికి దిగటంతో వారిని నియంత్రించటం కష్టంగా మారింది. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. ఊహించని ఘటనతో పోలీసు ఉన్నతాధికారులు స్టేషన్ కు చేరుకుంటున్నారు. అగ్నిగుండంగా మారిన పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చేతుల్లో కర్రలు..రాళ్లతో విధ్వంసానికి దిగిన ఆందోళన కారులను బయటకు పంపేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. రైళ్లలోని లగేజీ వ్యాగన్లు చాలా వరకు మంటల్లో ఆహుతయ్యాయి. ట్రాక్ లపైన లగేజీ సామాన్లతో పాటుగా విధ్వంసం చేసిన వస్తువులను పడేయటంతో స్టేషన్ లో రైళ్ల రాకపోకలను నిలిపివేసారు.
ఊహించని దాడి - రైళ్లు రద్దు
స్టేషన్ లో ఇప్పుడిప్పుడే పరిస్థితి పూర్తిగా అదుపులోకి తీసుకొస్తున్నారు. రైళ్లను మాత్రం పూర్తిగా పరిస్థితి నియంత్రణలోకి వచ్చిన తరువాతనే ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. స్టేషన్ లోని రైల్వే ఆస్తులకు పెద్ద మొత్తంలో నష్టం జరిగింది. ప్రయాణీకులు ఆందోళన తో బయటకు పరగులు తీసారు. ఈ నిరసనలో కీలకంగా ఉన్న వారిని గుర్తించే పని ప్రారంభించారు. నిరసన ఉంటుందనే సమాచారంతో కొద్ది పాటి సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసారు. కానీ, ఊహించని విధంగా నిరసన విధ్వంసాలకు దారి తీయటంతో.. పోలీసులు వారిని నియంత్రించలేకపోయారు. ప్లాట్ ఫాం 9,10 వద్ద మాత్రం పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది. రైల్వే పోలీసులు.. సాధారణ పోలీసులు పెద్ద సంఖ్యలో మొహరించారు.












Click it and Unblock the Notifications