హీరోలు డైలాగ్స్,క్రికెటర్లు సిక్సర్లు కొట్టినంత ఈజీ కాదు వ్యవసాయం.!క్రికెటర్లకు, హీరోలకు జగ్గారెడ్డి చురకలు.!
హైదరాబాద్ : ఈ మధ్య కాలంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి మరో ఆసక్తికర చర్చకు తెరతీసారు. దేశ రాజధాని సరిహద్దుల్లో దాదాపు రెండు నెలలకు పైగా నిరసన చేస్తున్న రైతుల పట్ల క్రికెటర్లు, సినిమా కథానాయకులు చేస్తున్న వ్యాఖ్యల పట్ల జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎవరి హద్దుల్లో వారు సంయమనం పాటిస్తే సమంజసంగా ఉంటుందనే సంకేతాలను పంపారు. క్రికెటర్లు స్టేడియాల్లో సిక్సర్లు కొట్టినంత సులువుగా పంటను పండించలేరని, హీరోలు డైలాగులు, డాన్సులు చేసినంత ఈజీగా వ్యవసాయం చేయలేరని చమత్కరించారు.
రైతులు దేశానికి వెన్నెముక.. ఆ విషయాన్ని సెలబ్రిటీలు మర్చిపోవద్దన్న జగ్గారెడ్డి..
కేంద్ర ప్రభుత్వం రైతు పండించిన పంటను కార్పొరేట్ వ్యవస్థ ద్వారా నిర్బంధించి, భారత దేశంలో ఉన్న రైతును ఆర్ధికంగా నడ్డి విరిగేలా చట్టాలు తీసుకొచ్చిందని, అందుకు నిరసన కార్యక్రమాలు కూడా ఆకాశాన్నంటుతున్నాయని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత రెండు నెలలుగా చల్లని చలిలో, 10 ఏళ్ల నుండి తొంబై ఏళ్ల వయసు కలవారు,యువతి యువకులు మొత్తం ఢిల్లీలో దీక్షలు చేస్తున్నారని అలాంటి వారి పట్ల కొందకు కథానాయకులు, క్రీడాకారులు అనుచిత వ్యాఖ్యలు చేయడం తగతని జగ్గారెడ్డి హితవు పలికారు.
రైతులు తెలుపుతున్న నిరసనలో నిజాయితీ ఉంది.. మన సెలబ్రిటీలు గుర్తించాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే..
రైతులు పండించే పంట ద్వారా జీవనం కొనసాగిస్తున్న ప్రజలు, అదే రైతు ఉద్యమాలు చేస్తుంటే కొంత మంది చులకనగా మాట్లాడుతున్నారని జగ్గా రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. ఒక్క బీజేపీ, టీఆరెస్ పార్టీలు మినహా, కాంగ్రెస్ పార్టీ తోపాటు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు రైతులకు, రైతు ఉద్యమాలకు మద్దత్తు పలుకుతున్నాయని పేర్కొన్నారు. ఆ రైతులు పండించిన పంటను అనుభవిస్తూ అదే రైతుల పోరాటాన్ని వ్యతిరేకిస్తున్న కొంతమంది సినీ మరియు క్రికెట్ సెలబ్రిటీ లు మూర్ఖంగా మాట్లాడడం బాధాకరమని తెలిపారు. రైతు భూమి మీద నాగలి పట్టి దున్నడం, పంట పండించడం.. మొహానికి రంగులు వేసుకొని సినిమాలో నటించడం, ఒక క్రికెటర్ బ్యాట్ పట్టుకొని స్టేడియంలో ఆడటం అంత సులువు కాదని స్పష్టం చేసారు.
పంట పండించడం చాలా కష్టం.. రైతులను చులకనగా చూడొద్దన్న జగ్గన్న..
సినీ పరిశ్రమలో గానీ, క్రికెట్ క్రీడలో గానీ బ్రేక్ లు, కూల్ డ్రింక్స్ ,టీ లు, స్నాక్స్, విరామాలు ఉంటాయని, క్రీడాకారుడు ఆడుతుంటే చప్పట్లతో ప్రోత్సాహం ఉంటుందని, కానీ భూమి మీద నాగలి పట్టి దున్ని పంటలు పండించే రైతుకు ఇలాంటి సదుపాయాలు ఉండవని తెలిపారు. అలాంటి రైతులని కొందరు సెలెబ్రెటీ లు విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని, పరాయి దేశస్థులు రైతులకు మద్దతు తెలుపుతున్నారో వారిని చూసి ఆ సెలెబ్రెటీలు బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని జగ్గారెడ్డి మండిపడ్డారు. సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి, యాక్టర్లు కంగనా రనౌత్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ ఒకసారి నాగలి పట్టి భూమి దున్నగలరా? నీరు పోసి పంట పండించగలరా అని సూటిగా ప్రశ్నించారు.
రైతు సమస్యల నేపథ్యంలో సినిమాలు తీస్తారు.. రైతు ఉద్యమాలను వ్యతిరేకించడం భావ్యం కాదన్న జగ్గారెడ్డి.
కొందరు సినిమా సెలెబ్రెటీ లు రైతుల కష్టాల మీద, రైతు సమస్యల ఇతి వృత్తంగా సినిమాలు రూపొందించి సొమ్ము చేసుకోలేదా అని ప్రశ్నించారు జగ్గారెడ్డి. నకలి విత్తనాలు, పంట నష్టపోయిన రైతుల దీన గాధలతో, ఆత్మహత్య చేసుకున్న రైతుల మీద ఎంతో మంది సినీ సెలబ్రిటీ సినిమాలు తీసి ఆ రైతుల పేరు మీద సొమ్ము చేసుకోవడం లేదా అని నిలదీసారు. సినీ ప్రముఖులు, క్రికెటర్ల వృత్తిలో ఎన్నో కోట్లు సంపాదించినా., చివరకు ఆ రైతు పండించిన పంటను ఆహారంగా తీసుకునే ప్రాణాలు కాపాడుకుంటున్న అంశాన్ని మర్చిపోవద్దని తెలిపారు. రైతుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే చరిత్రలో మూర్ఖులుగా మిగిలిపోతారని కధానాయకులకు, క్రికెటర్లకు హెచ్చరికలు జారీ చేసారు జగ్గారెడ్డి.