హైదరాబాద్ ఓల్డ్ సిటీకి మెట్రో రైలు.. అధికారులపై ఎంపీ అసదుద్దీన్ మండిపాటు
మరికొద్ది గంటల్లో హైదరాబాద్ మెట్రో రైలు.. దేశంలోనే రెండో అతిపెద్ద కనెక్టివిటీగా అవతరించనుందనగా.. ఓల్డ్ సిటీలో మెట్రో నిర్మాణంపై హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చేసిన కామెంట్లు చర్చనీయాంశమయ్యాయి. దశలవారీ విస్తరణలో భాగంగా ఎంజీబీఎస్-జేబీఎస్ మధ్య సర్వీసులను శుక్రవారం సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఈ కార్యక్రమానికి ఎంపీ అసదుద్దీన్ కూడా హాజరుకావాల్సి ఉన్నా.. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఆయన రాకపై స్పష్టత కొరవడింది. అయితే ట్విటర్ లో ఆయన చేసిన పోస్టులు వైరలయ్యాయి.
కొత్తగా ఎంజీబీఎస్ నుంచి జేబీఎస్ వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రావడాన్ని ప్రస్తావిస్తూ హైదరాబాద్ మెట్రో రైలు అధికారులను ఉద్దేశించి ఎంపీ అసద్ ఇలా రాసుకొచ్చారు.. ''ఎంజీబీఎస్ నుంచి జేబీఎస్ మార్గాన్ని పూర్తి చేశారు.. దానికి నిధుల సమస్యలేవీ తలెత్తలేదు. చాలా సంతోషం. కానీ దారుల్ షిఫా(ఎంజీబీఎస్) నుంచి ఫలక్ నుమా వరకు మెట్రో నిర్మాణానికి మాత్రం మీరు ముదుకురావడంలేదు. సిటీ సౌత్ ఏరియా దగ్గరికొచ్చేసరికే మీరిలా ఎందుకు వ్యవహరిస్తారో సమాధానం కూడా చెప్పరు''అని ఓవైసీ ఫైరయ్యారు.

ఎంజీబీఎస్-జేబీఎస్ కారిడార్ ను సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రారంభించనున్న సందర్భంగా ఆ కార్యక్రమానికి సంబంధించిన ప్రకటనల్ని హైదరాబాద్ మెట్రో రైల్ అధికార ట్విటర్ పోస్టు చేయగా, వాటిని రీట్వీట్ చేస్తూ ఎంపీ అసదుద్దీన్ అధికారులపై మండిపడ్డారు. అసద్ కామెంట్లపై టీఆర్ఎస్ మంత్రులెవరూ స్పందించకపోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications