నుమాయిష్ - ఫుల్ జోష్.. 46 రోజుల పాటు ఎగ్జిబిషన్ సందడి
హైదరాబాద్ : నుమాయిష్ జోష్ కు అంతా సిద్ధమైంది. ఈమేరకు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ముస్తాబైంది. నెలన్నర రోజుల పాటు అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన కనువిందుగా సాగనుంది. దాదాపు 2,500 స్టాళ్లతో కొలువుదీరుతున్న "నుమాయిష్ - 2019" కి 25 లక్షల మంది వస్తారని అంచనా.
జనవరి 1 నుంచి 46 రోజుల పాటు సాగనున్న ఈ ఎగ్జిబిషన్ ను మంగళవారం సాయంత్రం 5 గంటలకు హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభిస్తారు. అనంతరం ప్రజలు చూసేందుకు వీలుగా అందుబాటులోకి రానుంది. నుమాయిష్ అన్నిరోజుల్లోనూ సాయంత్రం ప్రారంభమై అర్ధరాత్రి వరకు కొనసాగుతుంటుంది.
ఏది కావాలన్నా ఒకటే ప్లేస్.. సూపర్ నుమాయిష్
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రతి ఏటా "నుమాయిష్" వేడుకలా జరుగుతుంది. 1938వ సంవత్సరంలో 100 స్టాళ్లతో ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ సందడి ఏ యేటికాయేడు ప్రత్యేకత సంతరించుకుంటోంది. 2018తో 78 ఏళ్లు పూర్తిచేసుకుని ఈసారి 79వ పడిలోకి అడుగిడుతోంది. దేశవ్యాప్తంగా తరలివచ్చే వ్యాపారులతో.. ఈసారి దాదాపు 2500 స్టాళ్లు కొలువుదీరాయి. ఇక పిల్లలకు కావాల్సిన ఎంజాయ్ మెంట్ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది.
ఆహార పదార్థాల నుంచి గృహోపకరణాల వరకు ఇక్కడ దొరకని వస్తువంటూ ఉండదు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రాష్ట్రాలకు చెందిన వస్తువులు ఇక్కడ కొలువుదీరుతాయి. వివిధ రకాల వెరైటీలు, డిజైన్లతో పాటు పలు ప్రాంతాలకు సంబంధించిన కళాకృతులు, స్పెషల్ ఐటమ్స్ ఇక్కడ లభించడం విశేషం. అంతేకాదు బ్యాంకింగ్, బీమా తదితర పెద్దపెద్ద సంస్థలు సైతం ఇక్కడ స్టాళ్లు పెట్టుకుని వ్యాపారం పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంటాయి.
భద్రత.. సౌకర్యాలు
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రారంభమయ్యే నుమాయిష్ - 2019 కోసం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు సొసైటీ సభ్యులు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ చుట్టుపక్కల ఫ్రీ పార్కింగ్ వసతి కల్పించనున్నారు. ఇక సందర్శకులను ఆహ్లాదపరిచేలా ఓపెన్ ఎయిర్ థియేటర్ లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు. అలాగే విశాలమైన పచ్చిక బయళ్లను కూడా సిద్ధం చేశారు. మరోవైపు విజిటర్స్ రక్షణ కోసం నాలుగంచెల భద్రతా వ్యవస్థను అందుబాటులో ఉంచారు.
ఎగ్జిబిషన్ ఆదాయం.. విద్యాభివృద్ధి
జనవరి 8వ తేదీని మహిళలకు స్పెషల్ డే గా కేటాయిస్తారు. అలాగే జనవరి 31న చిల్డ్రన్స్ డే గా ప్రకటించి.. ఆరోజు 10వ తరగతి చదివే విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తారు. ఇక ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలో మహిళల కోసం స్పెషల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు. అదలావుంటే నుమాయిష్ నిర్వహణ ద్వారా లభించే ఆదాయాన్ని విద్యాభివృద్ధికి ఉపయోగిస్తున్నారు. పాలిటెక్నిక్, డిగ్రీ తదితర కోర్సులతో విద్యాసంస్థలను స్థాపించి పేద విద్యార్థులకు ఆసరాగా నిలబడుతున్నారు.