Amit shah VS Owaisi:ముస్లిం రిజర్వేషన్ల వ్యాఖ్యలపై అమిత్ షాకు ఓవైసీ ఛాలెంజ్..!
హైదరాబాదు: తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో రాష్ట్రంపై పట్టు బిగించాలన్న కసితో బీజేపీ పనిచేస్తోంది. ఇప్పటికే పలుమార్లు జాతీయ స్థాయి బీజేపీ నాయకులు తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఎప్పటికప్పుడు కేసీఆర్ సర్కార్పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అదే స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా కాషాయ నేతలపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
ఆదివారం చేవెళ్ల సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించి బహిరంగ సభలో మాట్లాడారు. ఓవైపు కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూనే మరోవైపు ముస్లింల రిజర్వేషన్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము తెలంగాణలో అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు తొలగిస్తామని ప్రకటన చేసి వివాదంకు తెరలేపారు. అదేసమయంలో మజ్లిస్ చేతిలో కారు స్టీరింగ్ ఉందంటూ ఎద్దేవ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రం పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదని ఫైర్ అయ్యారు ఓవైసీ. ఎంతసేపు ముస్లింలను తిట్టిపోయడమే బీజేపీ అమిత్షా పనిగా పెట్టుకున్నారని ఓవైసీ మండిపడ్డారు. ముస్లింలకు వ్యతిరేకంగా ప్రసంగాలు చేయడం తప్పితే ఒక విజన్ అంటూ బీజేపీకి ఏమీ లేదని ఎద్దేవ చేశారు. వారికి తెలిసిందల్లా ఫేక్ ఎన్కౌంటర్లు, హైదరాబాద్ పై సర్జికల్ స్ట్రైక్స్, కర్ఫ్యూలు, క్రిమినల్స్ బుల్డోజ్ చేసే వారిని జైలు నుంచి విడుదల చేయడమేనని అన్నారు
తెలంగాణ ప్రజలపై ఎందుకంత అక్కసు అని అమిత్షాను ట్వీట్ ద్వారా ప్రశ్నించారుర ఓవైసీ.ఎస్సీ ఎస్టీ ఓబీసీల పట్ల అమిత్షాకు నిజంగానే ప్రేమ ఉంటే ప్రస్తుతం ఉన్న 50శాతం కోట సీలింగ్ను తొలగించేలా రాజ్యాంగ సవరణ చేయాలని సవాల్ విసిరారు. ముస్లిం సామాజిక వర్గానికి రిజర్వేషన్లు అనే అంశం ఓ ప్రత్యేక డేటాను ఆధారం చేసుకుని ఇచ్చిందని గుర్తుచేశారు ఓవైసీ.
ఇదిలా ఉంటే కర్నాటకలో ఎన్నికల వేళ ఇప్పటికే ముస్లింలకు ఉన్న 4శాతం రిజర్వేషన్ను తొలగిస్తూ దాన్ని హిందూ సామాజిక వర్గంలోని రెండు అగ్రకులాల వారికి సమానంగా వర్తింపజేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దీనిపై సుప్రీం కోర్టు కూడా అభ్యంతరం తెలిపింది. రిజర్వేషన్లు 50శాతంను మించరాదంటూ 1992లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేస్తూ, కర్నాటక ప్రభుత్వం ఈ పరిధిని దాటిందంటూ వ్యాఖ్యలు చేసింది.












Click it and Unblock the Notifications