ఐటీ రైడ్స్ అసలు టార్గెట్ కేటీఆర్ ? వాసవి నుంచి వంశీరామ్ వరకూ ? లింకులతో వైసీపీకీ చిక్కులు !
తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ సాగిస్తున్న దూకుడు రాజకీయం ప్రభావం కేసీఆర్ తనయుడు కేటీఆర్ కు చుట్టుకుంటోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత హైదరాబాద్ లో పలువురు రియల్టర్లతో కేటీఆర్ పెనవేసుకున్న లింకుల నేపథ్యంలో ఆయనకు సన్నిహితులైన పలువురు రియల్టర్లు నడుపుతున్న సంస్ధలపై ఇప్పటికే ఐటీ విరుచుకుపడుతోంది. ఇదే క్రమంలో వాసవి, సుమధుర, ఫినిక్స్ వంటి సంస్ధలపై ఇప్పటివరకూ దాడులు జరగగా.. ఇవాళ వంశీరామ్ బిల్డర్స్ పై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. దీంతో లింక్ ఉన్న ఏపీ వైసీపీ నేతల ఇళ్లపైనా ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్ లో ఐటీ దాడులు
హైదరాబాద్ లో దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వంశీ రామ్ బిల్డర్స్ సంస్ధపై, అధినేత తిక్కవరపు సుబ్బారెడ్డి, ఆయన బావమరిది జనార్ధన్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలు, ఇతర ఆస్తులపై ఇవాళ ఐటీ దాడులు జరుగుతున్నాయి. బంజారాహిల్స్ లోని ఈ సంస్ధకు చెందిన కార్యాలయాలతో పాటు మొత్తం 15 లొకేషన్లలో ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయి దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో నకిలీ పత్రాలతో స్ధలాలు కొనుగోలు చేసి విక్రయించారనే ఆరోపణలతో పాటు పన్ను ఎగవేత ఆరోపణలపై ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ దాడుల ప్రభావం హైదరాబాద్ నుంచి విజయవాడ వరకూ కనిపిస్తోంది.

ఎవరీ వంశీరామ్ సుబ్బారెడ్డి ?
గత పాతికేళ్లుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో పాతుకుపోయిన వంశీరామ్ బిల్డర్స్ అధినేత తిక్కవరపు సుబ్బారెడ్డి. ఈ సంస్ధ గత పాతికేళ్లలో హైదరాబాద్ లో 85 ప్రాజెక్టులు నిర్మించింది. ప్రస్తుతం నగరంలో 9 కమర్షియల్ కాంప్లెక్స్ లు నిర్మిస్తోంది. అలాగే చేవెళ్లలో 250 ఎకరాల్లో ఫాంల్యాండ్స్ కూడా విక్రయిస్తున్నారు. ఈ సంస్ధ ప్రభుత్వం నుంచి అక్రమంగా అనుమతులు పొంది ప్రాజెక్టులు నిర్మిస్తోందని, టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వంశీ రామ్ సంస్ధను ఐటీ టార్గెట్ చేయడంతో నగరంలో ఒక్కసారిగా కలకలం రేగుతోంది.

టార్గెట్ కేటీఆర్ ?
హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ సంస్ధలు చట్టాల్ని ఉల్లంఘించి భారీ ప్రాజెక్టులు చేపట్టాయి. అలాగే వీటికి నిబంధనలు పాటించకపోయినా ప్రభుత్వ అనుమతులు పొంది నిర్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిపై చాలా చోట్ల కోర్టు కేసులు కూడా నడుస్తున్నాయి. అయినా ఇన్నాళ్లు వీటిని చూసీ చూడనట్లుగా వదిలేసిన ఐటీ అధికారులు.. ఇప్పుడు టీఆర్ఎస్, బీజేపీ పోరు నేపథ్యంలో వీటి దుమ్ముదులుపుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ మంత్రి, సీఎం కేసీఆర్ తనయుడైన కేటీఆర్ తో సన్నిహితంగా ఉండే వంశీ రామ్ బిల్డర్స్ వంటి సంస్ధలపై తనిఖీలతో ఆయన్ను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వాసవి, సుమధుర, ఫినిక్స్ వంటి కేటీఆర్ సన్నిహిత సంస్ధలపై దాడులు చేసి కేసులు పెట్టిన దర్యాప్తు సంస్ధలు ఇప్పుడు వంశీరామ్ ను కూడా ఇదే బాటలో టార్గెట్ చేస్తున్నట్లు అర్దమవుతోంది.

లింకులతో వైసీపీ నేతలపైనా ?
హైదరాబాద్ కేంద్రంగా తాజాగా విరుచుకుపడుతున్న కేంద్ర దర్యాప్తు సంస్ధలు, అక్కడి సంస్ధలు, వ్యక్తులతో సంబంధాలు కలిగిన, లావాదేవీలు నెరుపుతున్న ఏపీ నేతల్నీ వదలడం లేదు. ఇదే క్రమంలో వంశీ రామ్ బిల్డర్స్ తో లావాదేవీలు నెరుపుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు దేవినేని అవినాష్, వల్లభనేని వంశీ ఇళ్లపైనా ఇవాళ ఐటీ దాడులు చేస్తున్నారు. బంజారాహిల్స్ లోని దేవినేని అవినాష్ స్థలాన్ని వంశీరామ్ బిల్డర్స్ డెవలప్మెంట్కు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలోనే అవినాష్ ఇళ్లపై ఐటీ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే గన్నవరం ఎమ్మెల్యే వంశీ ఇళ్లపై కూడా మరో వ్యవహారంలో ఐటీ దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications