ఆధార్ కార్డు చూపించొద్దు, మైనార్టీల శక్తి మోడీకి చూపించాలి, మీరాలం ర్యాలీలో అసదుద్దీన్ ఓవైసీ
పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర రిజిష్టర్కు వ్యతిరేకంగా హైదరాబాద్లో ముస్లిం యునైటెడ్ యాక్షన్ కమిటీ నిర్వహించిన ర్యాలీలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ముస్లింలు పాల్గొన్నారు. పాతబస్తీ మీరాలంలో ముస్లింలు జాతీయ జెండా చేతపట్టుకొని ర్యాలీ తీశారు. మీరాలం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత ప్రారంభమైన ర్యాలీలో దాదాపు 40 వేల మంది ముస్లింలు పాల్గొన్నట్టు తెలుస్తోంది.

హిందుస్థాన్ జిందాబాద్..
హిందుస్థాన్ జిందాబాద్ అంటూ ముస్లింలు నినాదాలతో హోరెత్తించారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ పిలుపుమేరకు భారీగా ముస్లింలు పాల్గొన్నారు. ఈ నెల 4వ తేదీన ట్యాంక్బండ్పై చేపట్టిన ర్యాలీలో 25 వేల మంది పాల్గొనగా.. ఈ సారి అంతకు రెట్టింపు జనం పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన అసదుద్దీన్ ఓవైసీ.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఆధార్ చూపించొద్దు
సీఏఏను నరేంద్ర మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. ఎన్ఆర్సీని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆధారు కార్డు ఎవరు అడిగినా చూపించొద్దని ముస్లింలకు సూచించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలతో రాజ్యాంగాన్ని పరిరక్షించాలని, కానీ మోడీ ప్రభుత్వం అందుకు తూట్లు పొడుస్తుందని మండిపడ్డారు. సీఏఏ; ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టి.. మైనార్టీల శక్తి ఏంటో ప్రధాని మోడీకి తెలియజేయాలని అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. అంతేకాదు ఈ నెల 25వ తేదీన చార్మినార్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. 30వ తేదీన బాపుఘాట్లో మానవహార కార్యక్రమం చేపడుతామని వివరించారు.

ట్యాంక్బండ్పై..
మరోవైపు ఈ నెల 4వ తేదీ శనివారం రోజున పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరసత్వ రిజిష్టర్కు వ్యతిరేకంగా హైదరాబాద్లో ముస్లింలు భారీ ర్యాలీ తీశారు. ఇందిరాపార్క్ నుంచి ట్యాంక్ బండ్ పైకి వేలాది మంది ముస్లింలు తరలొచ్చారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పిలుపుమేరకు నగరంలోని ముస్లిం యువత కదిలొచ్చి, సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. ట్యాంక్బండ్పైకి ఆశేష జనవాహిని చేరుకోవడంతో ‘మిలియన్ మార్చ్'ను తలపించింది.

ఆశేష జనవాహిని
ఇందిరాపార్క్, ఎన్టీఆర్ స్టేడియం, లిబర్టీ జనసంద్రాన్ని తలపించాయి. ముస్లింలు జాతీయ జెండా చేతబట్టుకొని హిందుస్థాన్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ర్యాలీలో దాదాపు 25 వేల మందికిపైగా ముస్లింలు పాల్గొన్నట్టు తెలుస్తోంది. ముస్లింల ర్యాలీతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ట్యాంక్బండ్పై వచ్చే రహదారులు గంటల తరబడి వాహనాలు ఆగిపోయిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications