వైఎస్ షర్మిల్ హెల్త్ బులెటిన్ - అందులో కీలక అంశాలు
హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల హెల్త్పై తాజా అప్డేట్ వెలువడింది. ఆమెకు చికిత్స అందజేస్తోన్న అపోలో ఆసుపత్రి డాక్టర్లు ఈ మేరకు కొద్దిసేపటి కిందటే హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు. ఇందులో కీలక అంశాలను పొందుపరిచారు. మంచినీళ్లు కూడా ముట్టకుండా దీక్షను కొనసాగించడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తాయని డాక్టర్లు స్పష్టం చేశారు. విశ్రాంతి అవసరమని పేర్కొన్నారు.
ఢిల్లీకి చేరిన తాడిపత్రి రాజకీయం..!!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్తంభించిన తన పాదయాత్రను పునరుద్ధరించడానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ- వైఎస్ షర్మిల నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని లోటస్ పాండ్ నివాసం వద్ద రెండు రోజుల కిందట దీక్షకు దిగారు. పాదయాత్రకు అనుమతి లభించేంత వరకు దీక్ష కొనసాగిస్తానని పట్టుబట్టారు. ఆమె తల్లి వైఎస్ విజయమ్మ, పార్టీ నాయకులు పిట్టా రామిరెడ్డి తదితరులు దీక్షా శిబిరంలో బైఠాయించారు.
శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత వైఎస్ షర్మిల నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అంతకుముందే- పలుమార్లు ఆరోగ్య పరీక్షలను నిర్వహించారు డాక్టర్లు. ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే షర్మిలకు ఫ్లూయిడ్స్ను ఎక్కించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి నివేదికలను పోలీసులు తెప్పించుకున్నారు. ఆమె ఆరోగ్యం పరిస్థితి అంతకంతకూ క్షీణిస్తోండటాన్ని దృష్టిలో ఉంచుకుని బలవంతంగా దీక్షను భగ్నం చేశారు.
చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైఎస్ షర్మిల అక్కడే చికిత్స తీసుకుంటోన్నారు. ఆమెకు వైద్యాన్ని అందజేస్తోన్న డాక్టర్లు కొద్దిసేపటి కిందటే హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు. అర్ధరాత్రి ఒంటిగంటకు షర్మిల ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని పేర్కొన్నారు. అప్పటికే ఆమె లో-బ్లడ్ ప్రెషర్, నీరసం, బలహీనంగా ఉన్నారని చెప్పారు. మంచినీళ్లు గానీ ఇతర ద్రవ పదార్థాలను గానీ తీసుకోకపోవడం వల్ల డీహైడ్రేషన్కు గురయ్యారని వివరించారు. ఆర్థోస్టేటిక్ హైపోటెన్షన్తో బాధపడుతున్నారని పేర్కొన్నారు.
ఆమె శరీరంలో పెద్ద మొత్తంలో ఒలిగ్యురియాను గుర్తించినట్లు డాక్టర్లు ఈ హెల్త్ బులెటిన్లో పొందుపరిచారు. అలాగే- మెటబాలిక్ యాసిడోసిస్, ప్రీ-రీనల్ అజొటోమియా సమస్యలు తలెత్తినట్లు చెప్పారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటోన్నారని, ఆమె శరీరం వైద్యానికి స్పందిస్తోందని డాక్టర్లు తెలిపారు. ఇవ్వాళ లేదా రేపు ఉదయం డిశ్చార్జ్ చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వైఎస్ షర్మిల కనీసం రెండు నుంచి మూడు వారాల పాటు పూర్తిగా విశ్రాంతిని తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.