ఆ ఇద్దరూ కాంగ్రెస్ రెబెల్స్..! లగడపాటి జోస్యం వెనుక ఎవరిదైనా హస్తముందా?
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వారానికో సర్వే తెరపైకి వచ్చింది. టీఆర్ఎస్ దే మళ్లీ అధికారమంటూ మాగ్జిమమ్ సర్వేలు తేల్చాయి. కొన్నిమాత్రం ప్రజాకూటమిదే విజయమంటూ ప్రకటించాయి. అయితే ఆంధ్ర ఆక్టోపస్ గా ప్రాచుర్యం పొందిన లగడపాటి రాజగోపాల్ చెప్పిన జోస్యం రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. 8 నుంచి 10 స్థానాల్లో స్వతంత్ర్య అభ్యర్థులు గెలుస్తారని చెప్పడం వెనుక మతలబేంటి అనేది చర్చానీయాంశంగా మారింది.
మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట సెగ్మెంట్ నుంచి స్వత్రంత్ర అభ్యర్థి శివకుమార్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నుంచి అనీల్ జాదవ్ గెలుస్తారని చెప్పడం వెనక సమీకరణాలేంటి? మామూలుగా ఇది ఒక రకంగా సర్వే అయినా కూడా అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నారు? నిజంగా ఈ ఇద్దరు అభ్యర్థులకు విన్నింగ్ ఛాన్స్ అంతలా ఉందా? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అదలావుంటే వీరిద్దరు కూడా కాంగ్రెస్ రెబెల్స్ కావడం గమనార్హం.
రాజకీయ వ్యూహమా?
తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్రులు కీలకంగా మారుతున్నారని చెప్పిన లగడపాటి.. రెండు నియోజకవర్గాల్లో గెలుస్తారని చెప్పిన ఇద్దరూ కూడా కాంగ్రెస్ రెబెల్స్. ఆయన వీరిద్దరి పేర్లు వెల్లడించడం వెనుక రాజకీయ సమీకరణాలున్నాయా? లేదంటే ఏదైనా స్ట్రాటజీ ఉందా అంటూ అప్పుడే సోషల్ మీడియా కోడై కూస్తోంది. నారాయణపేట నుంచి బరిలో నిలిచిన శివకుమార్ రెడ్డికి, బోథ్ నుంచి పోటీచేస్తున్న అనీల్ జాదవ్ కు ఆయా జిల్లాలకు చెందిన సీనియర్ నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయట. కాంగ్రెస్ నుంచి టికెట్లు రాక రెబెల్స్ గా పోటీలో నిలిచిన వీరికి అన్నిరకాలుగా వారు సహకరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
శివకుమార్ రెడ్డి నేపథ్యం
మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గంలో స్వత్రంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కె.శివకుమార్ రెడ్డి. 2014 లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి టీడీపీ అభ్యర్థి ఎస్.రాజేంద్రరెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఆయనకు టీఆర్ఎస్ టికెట్ దక్కలేదు. దీంతో హస్తం గూటికి చేరారు. డీకే అరుణ ఆశీస్సులతో కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే ఆ పార్టీ కూడా మొండిచేయి చూపింది. దీంతో ఆయన రెబెల్ గా బరిలో నిలిచారు. ఈనేపథ్యంలో శివకుమార్ రెడ్డికి డీకే అరుణ అన్నీతానై వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆయన గెలుపు కోసం అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
అనీల్ జాదవ్ నేపథ్యం
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న అనీల్ జాదవ్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్ ఆశించారు. చివరకు టికెట్ రాకపోవడంతో రెబెల్ గా బరిలో నిలిచారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి సోయం బాపురావు, టీఆర్ఎస్ నుంచి రాథోడ్ బాపురావు పోటీ చేస్తున్నారు. అయితే అనీల్ జాదవ్ కు నిర్మల్ కు చెందిన కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి అండదండలు పుష్కలమనే టాక్ ఉంది. ఈ ఎన్నికల్లో అనీల్ జాదవ్ కు అవసరమైనవన్నీ ఆయనే సమకూరుస్తున్నట్లు సమాచారం.
ఆ ఇద్దరు సీనియర్లకు లగడపాటి మాట సాయమా?
ఈ రెండు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్, ప్రజాకూటమి అభ్యర్థుల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంటే శివకుమార్ రెడ్డికి, అనీల్ జాదవ్ కు థర్డ్ ప్లేస్ అనేది క్షేత్రస్థాయిలో వినిపిస్తున్న మాట. అలాంటిది లగడపాటి ఏకంగా వీరిని ముందువరుసలోకి తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటు నారాయణపేటలో డీకే అరుణ అనుచరుడు, అటు బోథ్ లో మహేశ్వర్ రెడ్డి నమ్మినబంటు.. ఇలా ఈ ఇద్దరి పేర్లు లగడపాటి ప్రస్తావించడం వెనుక ఆంతర్యమేంటి?
తాను ఏ రాజకీయ పార్టీకి చెందినవాడిన కాదని పునరుద్ఘాటించిన ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి.. కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు కీలకనేతలకు సంబంధించిన అనుచరులు స్వతంత్రులుగా గెలుస్తారని వెల్లడించడమేంటి? ఆ ఇద్దరు కాంగ్రెస్ సీనియర్లకు లగడపాటి ఇలా మాట సాయం చేస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే వేచి చూడాల్సిందే.